/rtv/media/media_files/2026/05/12/big-breaking-2026-05-12-12-49-07.jpg)
NEET (UG)-2026 exam canceled
NEET UG 2026 : దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ (NEET UG) 2026 పరీక్షపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాజస్థాన్లో పరీక్ష పేపర్ లీక్ అయినట్లు వచ్చిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో, పరీక్షల పారదర్శకతను, విశ్వసనీయతను కాపాడేందుకు కేంద్ర విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
National Testing Agency, with the approval of the Government of India, has decided to cancel the NEET (UG) 2026 examination conducted on 3 May 2026, and to re-conduct the examination on dates that will be notified separately. pic.twitter.com/fh4o4QtzfI
— ANI (@ANI) May 12, 2026
మే 3న నిర్వహించిన నీట్ పరీక్షకు సంబంధించి ‘గెస్ పేపర్’ (Guess Paper) లీక్ అయిందనే వార్తలు రాజస్థాన్లో తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు సంస్థల నుంచి అందిన ప్రాథమిక సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలించింది. పరీక్షా ప్రక్రియలో స్పష్టమైన అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా ఆధారాలు లభించడంతో, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా భావించి పరీక్షను రద్దు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తుది నిర్ణయం తీసుకుంది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను, ముఠాలను పట్టుకోవడానికి ఈ కేసు దర్యాప్తును కేంద్ర బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కి అప్పగించారు. వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
రద్దు చేసిన నీట్ యూజీ 2026 పరీక్షను త్వరలోనే తిరిగి నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. దీనికి సంబంధించిన కొత్త పరీక్షా షెడ్యూల్, తేదీలను ఎన్టీఏ తన అధికారిక వెబ్సైట్లో త్వరలోనే విడుదల చేయనుంది. అయితే, ఈ నిర్ణయంతో ఆందోళన చెందుతున్న విద్యార్థుల కోసం ఎన్టీఏ కొన్ని కీలక మినహాయింపులను ప్రకటించింది. రీ-ఎగ్జామ్ కోసం విద్యార్థులు మళ్లీ కొత్తగా ఎలాంటి దరఖాస్తులు (Registration) చేసుకోవాల్సిన అవసరం లేదు.ఈ పరీక్షకు హాజరయ్యేందుకు విద్యార్థులు ఎలాంటి అదనపు రుసుము (Exam Fee) చెల్లించాల్సిన పనిలేదు. పాత హాల్ టికెట్ల వివరాల ఆధారంగానే కొత్త అడ్మిట్ కార్డులను జారీ చేస్తారు. వాటి ద్వారా విద్యార్థులు నేరుగా పరీక్షకు హాజరుకావచ్చు.
లక్షలాది మంది విద్యార్థుల కష్టాన్ని, ప్రతిభను గుర్తించి ఎన్టీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నప్పటికీ, పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. కొత్త తేదీల ప్రకటన కోసం అభ్యర్థులంతా ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ను క్రమం తప్పకుండా పరిశీలించాలని అధికారులు సూచించారు.
Follow Us