/rtv/media/media_files/2024/11/02/x5llk8t9Gs6iTBmfypl7.jpeg)
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రపంచ కుబేరుడు మస్క్ పెద్ద షాకే ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మస్క్.. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 20 లక్షల మందికి పైగా ఫెడరల్ ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపించారు. గడిచిన వారం రోజుల్లో ఎవరెవరు ఏం పని చేశారనే వివరాలను ఐదు బుల్లెట్ పాయింట్ల రూపంలో చెప్పాలని ‘యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి శనివారం పంపిన మెయిల్లో పేర్కొన్నారు.
Also Read: Tamilanadu: నటి పై రాజకీయ నేత అత్యాచారం.. ఏడుసార్లు అబార్షన్..కోర్టు సంచలన తీర్పు!
సవివరమైన సమాచారం, లింకులు లేదా అటాచ్మెంట్లు పంపొద్దని ఆ మెయిల్ లో స్పష్టం చేశారు. సోమవారం రాత్రి 11:59 గంటల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. జవాబు ఇవ్వడంలో విఫలమైన వారిని రాజీనామా చేసినట్లుగానే పరిగణిస్తామని మస్క్ గట్టిగానే తేల్చిచెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.
ప్రత్యేక ప్రభుత్వ అధికారిగా, అధ్యక్షుడి సలహాదారుగా ఉన్న మస్క్కు ఫెడరల్ ఉద్యోగులను తొలగించే అధికారాలేమీ లేవని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. అమెరికాకు చెందిన అతి పెద్ద ఉద్యోగ సంఘం అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాతీయ అధ్యక్షుడు ఎవెరెట్ కెల్లీ దీనిపై స్పందిస్తూ.. ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ఫెడరల్ ఉద్యోగుల పట్ల, దేశ ప్రజలకు అందించే క్లిష్టమైన సేవల పట్ల ఆయనకు ఉన్న అయిష్టతను సూచిస్తున్నాయని చెప్పారు.
మస్క్ పంపిన మెయిల్ చాలా క్రూరంగా ఉందని అన్నారు. ఆయన ఆదేశాలతో ప్రభుత్వం చట్టవిరుద్ధమైన తొలగింపులకు పాల్పడితే వాటిని సవాలు చేస్తామని స్పష్టం చేశారు. తన జీవితంలో ఒక్కసారి కూడా నిజాయతీగా ప్రజలకు సేవ చేయని మస్క్తో తమ ఉద్యోగులకు విధుల గురించి చెప్పించడం అంటే వారిని అగౌరవపరచడమేనని అన్నారు. మరోవైపు, మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగానికి ప్రత్యేక అధికారాలిస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై ట్రంప్ సంతకం చేశారు.
ప్రతి ఏజెన్సీ ఉద్యోగుల తగ్గింపునకు ప్రణాళికలు చేపట్టడంతో పాటు, అవసరమైన మేరకే నియామకాలు చేపట్టాలని అందులో చెప్పారు. అనంతరం డోజ్ పనితీరును ట్రంప్ ప్రశంసించారు. మస్క్ చాలా మంచి పనిచేస్తున్నారని కొనియాడారు. ఆయన మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా, ‘ఈ వారంలో మీరేం పని చేశారు?’ అనే ప్రశ్న మస్క్ తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను కూడా అడిగిన విషయం తెలిసిందే.
2022లో ట్విటర్ను కొనుగోలు చేసేముందు ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్కు ఇదే ప్రశ్నను సంధించారు. అనంతరం ఆయన్ను సీఈవో పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే.
అవసరం లేదు: కాశ్
మస్క్ పంపిన మెయిల్పై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు 9వ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కాశ్ పటేల్ కాస్త భిన్నంగా స్పందించారు. ఆ మెయిల్కు స్పందించవద్దని ఎఫ్బీఐ సిబ్బందికి స్పష్టం చేశారు. ‘‘ఏం పనిచేస్తున్నారో తెలియజేయాలంటూ ఓపీఎం నుంచి ఎఫ్బీఐ ఉద్యోగులకూ మెయిల్ వచ్చి ఉండొచ్చు. ఎఫ్బీఐ నిబంధనల ప్రకారం ప్రస్తుతం దర్యాప్తు సంస్థలో సమీక్షల ప్రక్రియ జరుగుతోంది. ఏదైనా సమాచారం అవసరమైతే మేమే స్పందిస్తాం.
ప్రస్తుతానికి ఉద్యోగులెవరూ మస్క్ మెయిల్కు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని కాశ్ ఎఫ్బీఐ ఉద్యోగులకు సందేశం పంపారు. అలాగే జాతీయ భద్రతా సంస్థ కూడా.. తాము తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఎవరూ మస్క్ మెయిల్కు స్పందన తెలియజేయనక్కర్లేదని ఉద్యోగులకు సందేశం పంపించింది.
Also Read: Horoscope: నేడు ఈ రాశివారు చెప్పుడు మాటలకు దూరంగా ఉంటే మంచిది!
Also Read: Hezbollah-Nasralla: నసల్లా అంత్యక్రియలు..జనసంద్రంగా మారిన రోడ్లు..!