/rtv/media/media_files/2025/04/06/29fL1atvHn9iBYF5V2qL.jpg)
hanuman
రామాలయం లేని ఊరు.. హనుమంతుడు లేని రాములోరి ఆలయం ఉండదనేది పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ హనుమంతుడు లేని రామాలయం కూడా ఒకటి ఉంది. అది కూడా మరెక్కడో కాదు సాక్షాత్తు ఏపీలోనే ఉందని తెలుసా.. అదే వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం. అన్ని ఆలయాల్లో సీతారామలక్ష్మణ ఆంజనేయస్వాములు కనిపిస్తే ఇక్కడ మాత్రం ఆంజనేయస్వామి ఉండరు. దాని వెనుక కూడా ఆసక్తికరమైన కథ ఉంది.
Also Read: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
ఆంజనేయస్వామిని కలవకముందే.. ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు సంచరించారని.. అందుకే ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదనేది స్థానికులు చెబుతారు.ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. అందుకే ఒంటిమిట్టను ఏకశిలానగరం అని కూడా పిలుస్తారు. త్రేతాయుగంలో సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు దండకారణ్యంలో సంచరిస్తూ ఇక్కడకు వచ్చారని పురాణాలు చెప్తున్నాయి.
ఆ సమయంలో సీతాదేవికి బాగా దప్పిక వేసిందని.. సీతాదేవి దాహం తీర్చేందుకు శ్రీరాముడు భూమిలోనికి బాణం వేస్తే నీటిబుగ్గ పుట్టిందని పురాణాల్లో ఉంది. అదే ఒంటిమిట్ట రామతీర్థం అయ్యిందని చెప్తుంటారు.ఇక ఈ ఆలయం పేరుపైనా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కోదండరామస్వామి ఆలయాన్ని మిట్టమీద నిర్మించారని.. అందుకే ఒంటిమిట్ట రామాలయం అని పేరు వచ్చిందని కొంతమంది చెప్తుంటారు. అయితే ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామభక్తులు ఈ గుడిని నిర్మించారని.. వారి పేరుమీద ఒంటిమిట్ట రామాలయం అయ్యిందనేది మరో వాదన. సీతారాముల కల్యాణం తర్వాత మృకండ మహర్షి, శృంగి మహర్షి యాగ రక్షణ కోసం శ్రీరామలక్ష్మణులు ఇక్కడకు వచ్చారని.. అందుకు ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయించారని మరో కథనం. ఆ విగ్రహాలకు తర్వాత కాలంలో జాంబవంతుడు ప్రాణ ప్రతిష్ట చేశాడని మరికొందరు అంటుంటారు.
ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల కళ్యాణం రాత్రి వేళ ఎందుకు జరుగుతుందనే దానికి కూడా ఆసక్తికరమైన కథ ఉంది. అది కూడా శ్రీరామనవమి రోజున కాకుండా చైత్ర శుద్ధ పౌర్ణమి రాత్రి జరుగుతుంది. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వివాహం పగలు జరిగినప్పుడు, చంద్రుడు తన సోదరి లక్ష్మీదేవి పెళ్లిని చూడలేకపోయానని విష్ణువుతో మొరపెట్టుకున్నాడట. దీంతో "నీ కోరిక రామావతారంలో తీరుతుంది" అని మహా విష్ణువు వరమిచ్చాడు.
ఆ ప్రకారం ఒంటమిట్టలో సీతారాముల కళ్యాణం వెన్నెల వెలుగుల్లో నిర్వహిస్తారు. ఇక ఒంటిమిట్ట ఆలయ గోపురాలు చోళ శైలిలో, రంగమంటపం విజయనగర శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. 32 స్తంభాలతో కూడిన రంగమంటపం, 160 అడుగుల ఎత్తైన గోపురం దీని సౌందర్యాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.
Also Read: Sri Rama Navami 2025: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే
kadapa | vontimitta-kodandaram | temple | sri-rama-navami | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates