/rtv/media/media_files/2025/03/11/ir2DYSRnkbX4kXZ72pNS.jpg)
Telangana Assembly
Telangana Budget 2025: తెలంగాణ అసెంబ్లీలో నేడు రేవంత్ సర్కార్ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. ఉదయం 11.44 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందు.. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి అసెంబ్లీ కమిటీ హాల్-1లో ఉదయం 9.30 గంటలకు సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. ఈసారి సుమారు 3.30లక్షల కోట్లతో భట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
Also Read: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?
సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా కేటాయింపులు ఉంటాయన్న టాక్ ఆర్ధికశాఖ వర్గాల నుంచి వినిపిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, ఆరు గ్యారంటీలు, ట్రిపులార్, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణతో పాటు మూసీ పునరుజ్జీవానికి అవసరమైన నిధులు ఈ బడ్జెట్లో కేటాయించనున్నట్లు తెలుస్తోంది..! మరీ ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మిగిలిపోయిన పథకాలను పట్టాలెక్కించాలని భావిస్తోంది ప్రభుత్వం. అందులోభాగంగానే.. ప్రస్తుతం 2వేలుగా ఉన్న ఆసరా పెన్షన్ను కనీసం 3వేలకు పెంచాలని.. అందుకు ఏటా 3వేల నుంచి 4వేల కోట్ల రూపాయల ఖర్చు పెరనున్నట్లు అంచనా వేసింది. అలాగే.. మహాలక్ష్మీ పథకాన్ని.. దానికయ్యే ఖర్చును ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక కొత్తగా ప్రకటించిన రాజీవ్ యువవికాసం పథకానికి కూడా కేటాయింపులుండే ఛాన్స్ ఉంది. వీటన్నింటికీ తోడు ఇందిరమ్మ ఇళ్లకు భారీగానే నిధులు కేటాయించనుంది రేవంత్ సర్కార్.
కాగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వాస్తవ వ్యయాలు, రాబడుల ఆధారంగా బడ్జెట్ను తీర్చిదిద్దినట్టు సమాచారం. ఈసారి బడ్జెట్ రూ.3.10 లక్షల కోట్ల నుంచి రూ.3.30 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని సమాచారం. 2024--25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కానీ, అందులో పెట్టుకున్న లక్ష్యాల మేరకు ఖర్చు చేయలేకపోయింది. ఈసారి వ్యయం రూ.2.20 లక్షల కోట్ల వరకూ ఉండొచ్చని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఇలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, 7 లేదా 8 శాతం మేర నిధులను పెంచి కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టనుందని సమాచారం.
Also Read: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!
ఏ రంగానికి ఎంతెంత?
కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్తో పాటు కేసీఆర్ కిట్ స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఇక ప్రభుత్వం వివిధ రంగాలకు కేటాయించిన బడ్జెట్ ఇలా ఉంది. ఈసారి రూ.26 వేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ కోరింది. పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాధాన్య ప్రాజెక్టుల దృష్ట్యా సాగునీటి రంగానికి భారీగానే కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే, వైద్య ఆరోగ్య శాఖకు ఈసారి రూ.12-13 వేల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖకు రూ.11,468 కోట్లను కేటాయించారు. ఈసారి తమకు రూ.9 వేల కోట్లు కేటాయించాలని హోంశాఖ కోరింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు రూ.2,500 కోట్లను కేటాయించినట్లు సమాచారం. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోలకు అదనపు కేటాయింపులు అవసరమంటూ బడ్జెట్ కసరత్తు సందర్భంగా హోంశాఖ వివరించింది.
2024-25లో పోలీసు శాఖకు రూ.8,659 కోట్లు కేటాయించారు. ఈసారి స్వల్పంగా పెరుగుదల ఉంటుందని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోలీసు అకాడమీ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, జైళ్లు, అగ్నిమాపక విభాగం, స్పెషల్ బెటాలియన్లు, ఎస్పీఎ్ఫకు ఈసారి కూడా కేటాయింపులు పెద్దగా పెరగకపోవచ్చని తెలుస్తోంది. ఇక మహిళా శిశు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ శాఖకు కొత్త బడ్జెట్లో రూ.3,700 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. ఇందులో అంగన్వాడీలలో చిన్న పిల్లల సంరక్షణకు రూ.100 కోట్ల వరకూ ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఇవి కాక, మహిళా శిశు సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉండే మహిళా సహకార సంస్థ, మహిళా కమిషన్కు కూడా కొంత మేర నిధులను కేటాయించనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు రూ.350 కోటు, రోడ్లు-భవనాల శాఖకు రూ.6000--7000 కోట్ల వరకు, మిషన్ భగీరథకు రూ.6000 కోట్ల మేరకు నిధులు కేటాయించనున్నారని సమాచారం.
రాజీవ్ యువ వికాసానికి ప్రాధాన్యత
మెట్రో రైలు రెండో దశ, స్కిల్ యూనివర్సిటీ, రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్), మూసీ రివర్ ఫ్రంట్ వంటి ఫ్లాగ్షిప్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అత్యంత ప్రాధాన్యమివ్వనుంది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం భూసేకరణకు పరిహారం చెల్లింపు కింద రూ.1,525 కోట్లను కేటాయించనున్నట్లు సమాచారం. మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 30 శాతం మేర నిధుల్లో కొంత మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించవచ్చని తెలిసింది. వ్యవసాయ రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించే ‘ఇందిరా ఆత్మీయ భరోసా’ పథకాన్ని ఈ ఫిబ్రవరి 26న ప్రభుత్వం ప్రారంభించింది. దీనికింద మొదటి దశలో 18,180 మంది లబ్ధిదారులకు రూ.6000 చొప్పున సొమ్మును అందజేసింది. మిగతా రూ.6000 చొప్పున ఇంకా అందించాల్సి ఉంది. కొత్త లబ్ధిదారులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో.. ఈ పథకానికి ఈసారి రూ.350 కోట్లను కేటాయిచనుందని సమాచారం. అలాగే.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిమిత్తం గృహనిర్మాణ శాఖకు ఈసారి రూ.8-9 వేల కోట్ల వరకు కేటాయించనున్నారని సమాచారం. నిరుద్యోగ యువత ఒక్కొక్కరికీ రూ.3 లక్షల లోపు ఆర్థిక సాయాన్ని అందించే ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి కొత్త బడ్జెట్లో రూ.6000 కోట్లను కేటాయించనుంది.
Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!
ఇక పోయినసారి బడ్జెట్ 2.91లక్షల కోట్లు కాగా ఈసారి 15శాతం మేర అంటే 3.30లక్షల కోట్లు దాటుతున్నట్లు తెలుస్తోంది. గతకొన్నేళ్లుగా రాష్ట్ర బడ్జెట్ను పరిశీలిస్తే.. ఒక్క కరోనా ఏడాది మినహా ప్రతి ఏడాది 25వేల కోట్ల నుంచి 35వేల కోట్ల మేర పెరుగుతూ పోయింది. మొత్తంగా.. ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ముఖ్యంగా ఆరుగ్యారంటీలకు భారీ నిధులంటూ జరిగిన ప్రచారం బడ్జెట్పై అంచనాలు పెంచాయి.
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..