/rtv/media/media_files/2026/04/16/ou-2026-04-16-21-09-21.jpg)
Osmania Hospital
Osmania Hospital : ఉస్మానియా జనరల్ హాస్పిటల్ జనరల్ సర్జరీ విభాగంలో మొదటి సంవత్సరం పీజీ చదువుతున్న డాక్టర్ సురేష్ కాట్రావత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. హాస్టల్లో ఉండే సురేష్ మత్తు ఇంజక్షన్తోపాటు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడటం వైద్యులను, వైద్య విద్యార్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే అతడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల క్రితమే ఉస్మానియా కళాశాలలో పీజీలో చేరిన సురేష్ అకస్మాత్తుగా మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ర్యాగింగ్ వల్లే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వద్ద సురేశ్ కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాలు ఆందోళనకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాగా సురేష్ పై ర్యాగింగ్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని... ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి.
మానసిక ఒత్తిడే కారణం
కాగా సురేష్ మరణంపై విషాదం వ్యక్తం చేసిన హెల్త్కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) వైద్యులు మెడికోల మానసిక ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. వరుసగా పెరుగుతున్న పని గంటలు, విపరీతమైన ఒత్తిడి, అధిక అంచనాల మధ్య పీజీ విద్యార్థులు నలిగిపోతున్నారని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. వైద్యుల్లో మానసిక సమస్యలపై వారికి తక్షణమే కౌన్సెలింగ్, వృత్తిపరమైన సహాయం అందించాలని డిమాండ్ చేసింది.
Follow Us