/rtv/media/media_files/2025/03/27/HcezBLeBnHxyUUKp8ieM.jpg)
Kukatpally Housing Board Colony
KPHB : హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వేలం వేసిన ప్లాట్ల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.గతేడాది ప్లాట్లు వేలంలో సొంతం చేసుకున్న కొందరు డబ్బులు కట్టకపోవడంతో వేలం రద్దు చేయాలని హౌసింగ్ బోర్డు తాజాగా డిసైడ్ అయింది. గతేడాది డిసెంబరులో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో మిగిలిన ప్లాట్లను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 72 ప్లాట్లను వేలం వేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల 44 ప్లాట్లకు మాత్రమే వేలం వేశారు. వాటిలో కేవలం 19 ప్లాట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.
Also Read: రూ.10లక్షల కోట్లతో.. 25వేల కి.మీ రోడ్లు : నితిన్ గడ్కరీ
పశ్చిమ జోన్లో మెుత్తం 12 ప్లాట్లు అమ్ముడుపోగా.. వాటిలో 9 ప్లాట్ల వేలం రద్దు చేయాలని అధికారులు తాజాగా నిర్ణయించారు. రూల్స్ ప్రకారం.. వేలంలో ప్లాటు దక్కించుకున్న వారు అయిదు రోజుల్లో 25 శాతం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన డబ్బు రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాలి. కానీ ముగ్గురు మాత్రమే పూర్తి డబ్బును చెల్లించారు. మిగిలిన వారు కొంత డబ్బు కట్టి వేలంలో పాల్గొన్నారు. ప్రస్తుతం వేలంపై తెలంగాణ హైకోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు తీర్పు వచ్చాక రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులు అనుకుంటున్నారు. వేలం జరిగి రెండు నెలలు అయినా.. 9 మంది 25 శాతం కూడా డబ్బు కట్టలేదు. అందుకే ఆ ప్లాట్ల వేలం రద్దు చేయాలని తాజాగా నిర్ణయించారు. డబ్బులు చెల్లించిన వారికి నోటీసులు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నోటీసులు జారీ చేసే ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలిపారు.
Also Read: వినియోగదారులకు షాక్.. పెరిగిన పాల ధరలు.. ఎంతంటే ?
అయితే, హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలంపై వివాదాలు నెలకొన్నాయి. గతేడాది వేలంపాట జరగ్గా.. ఫేజ్-15 నివాసితులు వ్యతిరేకించారు. వారు ప్లాట్ల వేలాన్ని నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వేలం వేసిన భూమిలో కొంత భాగాన్ని రోడ్డు విస్తరణ కోసం కేటాయించారని.. నిబంధనలను ఉల్లంఘించి ప్లాట్లను విక్రయిస్తున్నారని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. మొదట 80 నుండి 100 అడుగులకు రహదారిని విస్తరించాలని అనుకున్నా ప్రతిపాదిత రహదారిలోని 10 అడుగులను అమ్మకానికి పెట్టారని పేర్కొన్నారు. దీనిపై ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోంది. ఈ కేసు పూర్తయిన తర్వాత ప్లాట్లు దక్కించుకున్నవారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.