IPL 2024: హైదరాబాద్‌లో ఐపీఎల్ హంగామా..స్టేడియం దగ్గర కాంగ్రెస్ గొడవ

హైదరాబాద్‌లో మళ్ళీ ఐపీఎల్ సందడి మొదలైంది. ఈరోజు బెంగళూరు, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ భారీ స్కోర్లు కొడుతూ మంచి ఊపు మీద ఉంటే...రాయల్ ఛాలెంజర్స్ మాత్రం వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతోంది.

New Update
IPL 2024: హైదరాబాద్‌లో ఐపీఎల్ హంగామా..స్టేడియం దగ్గర కాంగ్రెస్ గొడవ

SRH VS RCB :ఈ ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు అందరినీ ఆకట్టుకుంటోంది. వరుసగా భారీ స్కోర్లు సాధిస్తూ దూసుకుపోతోంది. అందులోనూ హైదరాబాద్‌లో మ్యాచ్ అంటే ఇక చెప్పనే అక్కర్లేదు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు మధ్య ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30గంటలకు మ్యాచ్ జరగనుంది. ఇంతకు ముందు ఇదే స్టేడియంలో రెండు మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్హెచ్ భారీ స్కోరులు సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ దూసుకుపోతోంది. సన్ రైజర్స్ టీం ను ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. సాధ్యం కావడం లేదు. ప్రత్యర్థి టీం లు కూడా వారి బాదుడుకు చేష్టలుడిగి చూడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. మరోవైపు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వరుసగా ఓటములు ఎదుర్కోంటోంది. ఎంత కష్టపడినా వాళ్ళకు విజయం మాత్రం దక్కడం లేదు.

ఇక ఈరోజు మ్యాచ్‌లో అందరూ అనుకుంటున్నట్టుగానే సన్ రైఊజర్స్ జట్టే ఫేవరెట్. ఇప్పటికే 287 పరుగుల అత్యధిక స్కోరును తన పేరు లిఖించుకున్న ఎస్‌ఆర్‌హెచ్ ఈరోజు మ్యాచ్‌లో 300పైన కన్నేసింది. హైదరాబాద్ బ్యాటర్ల ధాటికి ఆర్సీబీ వణికిపోవడం గ్యారంటీ అంటున్నారు. 300 పరుగులు కచ్చితంగా వస్తాయని జోస్యాలు చెబుతున్నారు. డేంజరస్‌ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్న హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. బెంగళూరును మరోసారి ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు అట్టడుగు స్థానానికి పడిపోయిన ఆర్సీబీ గౌరవంగా సీజన్‌ ముగించాలన్నా.. ఈ మ్యాచ్‌లో నెగ్గి తిరిగి విన్నింగ్‌ ట్రాక్‌ ఎక్కాల్సిందే.

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అవతలి జట్లను బెంబేలెత్తిస్తోంది. మొదటి నుంచే బ్యాటర్లు బాదుతూ విధ్వంసంకర బ్యాటింగ్‌తో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ముంబైపై మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి రికార్డు సృష్టించిన హైదరాబాద్‌...బెంగళూరుపై మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి పాత రికార్డును బద్దలుకొట్టింది. ఢిల్లీపైన విధ్వంసకర బ్యాటింగ్‌తో 250కుపైగా పరుగులు సాధించింది. పవర్‌ ప్లేలో ఒక్క వికెట్‌ కోల్పోకుండా 125 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనే 300 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ అందుకుంటుందని అందరూ భావించారు. కానీ హైదరాబాద్‌ మిడిల్‌ ఆర్డర్‌ కాస్త తడబడడంతో ఈ ఛేదన సాధ్యం కాలేదు. ఇప్పుడు బెంగళూరు మీద ఆ ఫీట్ సాధిస్తుందని ఆశిస్తున్నారు.

స్టేడియం దగ్గర ఆందోళన..

మరోవైపు ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్త పరిస్థితులునెలకొన్నాయి. మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత శివసేరెడ్డి స్టేడియాన్ని ముట్టడించేందుకు వెళ్ళారు. అయితే వీరిని పోలీసులు రామాంతపూర్‌ దగ్గరే ఆపారు. తరువాత ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న జగన్మోహన్ రావు తనకు చెందిన అక్షర స్కూల్స్ యాజమాన్యంతో అక్రమంగా టిక్కెట్లను బ్లాక్లో అమ్ముతున్నారంటూ ఆందోళనకు శివసేనారెడ్డి పిలుపునిచ్చారు. కాంప్లిమెంటరీ పాస్‌లను బ్లాక్‌లో అమ్మేసుకున్నారని శివసేన రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా హెచ్ సిఏ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అందుకే హెచ్‌సీఏ ప్రెసిడెంట్ మీద ఉప్పల్ స్టేషన్లో కేసు పెట్టనున్నామని చెప్పారు.

మెట్రో టైమింగ్స్ పొడిగింపు..

ఈరోజు హైదరాబాద్‌లో మ్యాచ్ జరుగుతున్న కారణంగా మెట్రో సేవలను పొడిగించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈరోజు మూడు కారిడార్‌లలో ఆఖరి మెట్రో సర్వీసులు రాత్రి 12.15 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 1.10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. దాంతో పాటూ అదనపు బస్ సర్వీసులను కూడా ఏర్పాటు చేశారు. 60 బస్సులు ఆదనంగా నడపనున్నామని ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.అర్ధరాత్రి వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

Also Read:Stock Markets: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..నాలుగు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు

Advertisment
Advertisment
తాజా కథనాలు