/rtv/media/media_files/2026/03/24/supreme-court-2026-03-24-14-50-27.jpg)
Supreme Court
బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని గతంలో తాము జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. స్కూళ్లు, కాలేజీలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు లాంటి బహిరంగ ప్రదేశాలలో వీధి కుక్కల సంచారాన్ని నియంత్రించాలన్న ఉత్తర్వులపై జంతు ప్రేమికులు, జంతు సంక్షేమ బోర్డు (AWBI) దాఖలు చేసిన అభ్యర్థనలను కోర్టు తోసిపుచ్చింది. వీధి కుక్కల సమస్యను జంతు సంక్షేమ కోణంలోనే కాకుండా, అంతకన్నా ముఖ్యంగా ప్రజల ప్రాణాల భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించాల్సి ఉంటుందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
ఈ సమస్య పరిష్కారం కోసం యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) తయారుచేసిన ప్లాన్ను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో పూర్తి స్థాయి యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. కుక్కల జనాభాను బట్టి ఒకే జిల్లాలో ఈ నియంత్రణ కేంద్రాల సంఖ్యను పెంచాలని సూచనలు చేసింది. ఈ రూల్స్ అన్ని కూడా రాష్ట్రాల్లో కచ్చితంగా అమలయ్యేలా కేంద్రం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది.
Also read: వాహనాదారులకు బిగ్ షాక్.. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
విద్యార్థులు, ప్రయాణికుల రక్షణ దృష్ట్యా విద్యాసంస్థలు, రవాణా కేంద్రాల పరిసరాల్లో ప్రత్యేక నిఘా, చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. వీధి కుక్కల దాడులకు గురయ్యే బాధితుల కోసం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో యాంటీ రేబిస్ మందులు (టీకాలు) నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. కుక్కలు మాత్రమే కాకుండా జాతీయ రహదారులపై సంచరించే పశువుల వల్ల జరిగే ప్రమాదాలను అడ్డుకునేందుకు ప్రత్యేక మానిటరింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)ను కూడా ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో మరో కీలకమైన వెసులుబాటును కల్పించింది. రేబిస్ బారిన పడ్డ లేదా మానవుల ప్రాణాలకు ముప్పుగా ఉండే అత్యంత ప్రమాదకరమైన కుక్కల విషయంలో చట్టబద్ధంగా పర్మిషన్ ఇచ్చిన ఎలాంటి కఠిన చర్యలైనా తీసుకోవచ్చని తెలిపింది. ఈ కోర్టు ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే మున్సిపల్, స్థానిక సంస్థల ఉద్యోగులకు కూడా సరైన రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాలకు సూచనలు చేసింది. వారు తమ విధులను నిర్వర్తించే సమయంలో ఎవరూ కూడా ఎలాంటి బలవంతపు లేదా వేధింపుల చర్యలకు పాల్పడకూడదని తేల్చిచెప్పింది.
Follow Us