/rtv/media/media_files/2025/02/15/wWeRi7r3B3kwqeivmuun.jpg)
lemon
మార్కెట్లో నిమ్మకాయ మహా అయితే ఎంత ఉంటుంది ఓ రూ.5 వరకు ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉండే వేసవికాలంలో రూ.10లకు అమ్ముతుంటారు. కానీ, ఇక్కడ ఓ నిమ్మకాయ ధర అక్షరాలా ఆరు లక్షలు. అవును ఇది నిజమే. వేలంలో ఓ నిమ్మపండు ఏకంగా రూ.5.9 లక్షలకు అమ్ముడుపోయింది. అయితే ఇది మార్కెట్లో కాదండోయ్. తమిళనాడులోని ఓ ఆలయం ఉత్సవాల్లో జరిగిన వేలంలో ఓ భక్తుడు దీనిని దక్కించుకున్నారు. పూజలోని ఈ నిమ్మకాయలను కొనేందుకు భక్తులు ఎగబడతారు. ప్రారంభ ధరే వేలల్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ నిమ్మకాయ ఇంటిలో ఉంటే అంతా శుభమే జరుగుతుందని బలంగా నమ్ముతుంటారు.
వివరాల్లోకి వెళ్తే.. పుదుకోట్టై జిల్లా తిరువరంగుళం వల్లనాట్టు చెట్టియార్ వంశీయులు తైపూస ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలు ముగిసిన మర్నాడు నుంచి మూడు రోజులు పాటు పళనిలో బస చేసి... పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. సుబ్రమణ్య స్వామి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా దాదాపు 300మందికి పైగా చెట్టియార్ సామాజికవర్గం పళనికి వెళ్లి తైపూస ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. మూడు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నాం, రాత్రి అన్నదానం చేసేటప్పుడు, దర్శనం సమయంలో ఒక్కో నిమ్మకాయ పెట్టి పూజలు చేశారు.
అభిషేక నిమ్మకాయ...
ఈ క్రమంలో ఆ నిమ్మకాయలను పళని పెరియనాయకి అంబాల్ ఆలయం వద్ద నిమ్మకాయలను వేలం వేశారు. అయితే, కేవలం చెట్టియార్ వర్గీయులు మాత్రమే వేలంలో పాల్గొంటారు. అన్నదాన సమయంలో పూజలో పెట్టిన ఒక్కో నిమ్మకాయ రూ.16వేలు- రూ.40వేల వరకు ధర పలికాయి. తైపూసం రోజున పళని సుబ్రమణ్యస్వామి వద్ద పూజలో ఉంచిన అభిషేక నిమ్మకాయను దక్కించుకోడానికి ఆ వంశీయులు పోటీపడ్డారు. వారిలో ఒకరు ఏకంగా రూ.5.9 లక్షలకు వేలంలో పాడి సొంతం చేసుకున్నారు. స్వామివారి పాదాల చెంతన ఉంచిన నిమ్మకాయను ఇంటిలో పెట్టుకుంటే అంతా శుభాలు చేకూరుతాయనే నమ్మకంతో లక్షలు పెట్టేందుకు వెనుకాడలేదు.
కాగా, గతంలోనూ తమిళనాడులోని ఆలయాల్లో నిమ్మకాయలను లక్షలు కొనుగోలు చేసిన ఘటనలు ఉన్నాయి. విల్లుపురం ఆలయంలో గతేడాది ఉతిరమ్ పండుగ సందర్భంగా నిమ్మకాయలను వేలం వేయగా..ఓ భక్తుడు 9 నిమ్మ పండ్లను రూ.2.36 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. సంతానం లేని దంపతులు ఈ పండుగ సందర్భంగా మురుగన్ ఆలయాన్ని సందర్శించి వేలంలో నిమ్మకాయలను కొంటారు.