/rtv/media/media_files/2025/02/19/kqsIjdJxA9D0KOD4u454.jpg)
Women CM's In Delhi
మహిళలు అత్యధికంగా ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రం ఒక్క ఢిల్లీనే. ఇక్కడ ఇంతకు ముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిశీ లు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి రేఖా గుప్తా సీఎం అవుతున్నారు. దేశంలో పశ్చిమ బెంగాల్ లో తప్ప మిగతా ఎక్కడా మహిళా సీఎంలు ఉన్న దాఖలాలు లేవు. కేవలం ఆ ఒక్క చోట మాత్రమే దీదీ మమతా చాలా ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉంటూ వస్తున్నారు. దాని తరువాత మహిళా సీఎంలకు పెట్టింది పేరు ఒక్క ఢిల్లీనే. ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని మహిళలు చాలా ఏళ్ళే పరిపాలించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పేరు గాంచారు. దాదాపు 15 ఏళ్ళు ఆమె ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు.
హ్యాట్రిక్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్..
షీలా దీక్షిత్ కంటే ముందు సుష్మా స్వరాజ్ రెండు నెలల పాటూ ఢిల్లీకి సీఎంగా ఉన్నారు. ఆమె తరువాత వచ్చిన షీలా దీక్షిత్ 1998లో ఢిల్లీలో తమ తిరుగులేని ఆధిపత్యాన్ని స్థాపించారు. ఆమె దెబ్బకు చాలా మంది పెద్ద నాయకులు సైతం ఓడిపోగా 15 సంవత్సరాలు తిరుగులేని ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1998లో షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ కు ఢిల్లీలో తిరుగులేకుండా పోయింది. దీక్షిత్ నాయకత్వంలో రాజధాని మెట్రో సేవలను ప్రవేశపెట్టడం, ఫ్లైఓవర్ల నిర్మాణంతోపాటు CNGని ప్రోత్సహించడం వంటి ప్రధాన నిర్ణయాలతో సహా అద్భుతమైన మార్పులను చూసింది.
ఈమె తర్వాత కేజ్రీవాల్ సీఎం అయ్యారు. అయితే ఆయన పదేళ్లు పాలించి అవినీతి ఆరోపణలతో జైలు కెళ్ళొచ్చాక రాజీనామా చేశారు. దీని తర్వాత అదే పార్టీ నుంచి అతిశీ ముఖ్యమంత్రి అయ్యారు. కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన చేసినప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు అతిశీనే చూసుకున్నారు. ఆమె ద్వారానే మొత్తం పనులు అన్నీ అయ్యాయి. కేజ్రీవాల్ లేని పమయంలో పార్టీని, ఢిల్లీని ముందుకు నడిపించడంలో అతిశీ ముఖ్యపాత్ర పోషించారు.
ఇప్పుడు బీజేపీ కూడా ఢిల్లీకి మహిళనే సీఎంగా నిర్ణయించింది. ఇప్పటివరకు బీజేపీ పాలనలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో పురుషులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అందుకే ఒకచోట మహిళా సీఎం ఉంటే బావుంటుందని ఆ పార్టీ అధిష్టానం భావించింది. దానికోసమే స్ట్రాటజిక్ గా రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా నిర్ణయించింది. మొదటి సారి ఎమ్ఎల్ఏ అయిన వెంటనే రేఖా సీఎంగా అవడం మరో విశేషం. రేపు ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో ఈమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖా గుప్తా 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి అప్ అభ్యర్థిపై 29వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచింది. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా నిలిచారు. ఈమె 1997లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలి కూడా ఎన్నికైయ్యారు. రేఖా గుప్తా 2007, 2012లో ఢిల్లీ కౌన్సిలర్గా గెలిచారు.
Also Read: Rekha Gupta: ఫస్ట్ టైం MLAకే CM పదవి.. స్టూడెంట్ లీడర్ నుంచి ఢిల్లీ సీఎం పీఠం