/rtv/media/media_files/2025/03/06/40iwRcuVLI8vWRTZpgIt.jpg)
Gold mines in Pakistan
Pakistan: ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ పంట పడింది. భారత్ గుండా ప్రవహించే సింధు నది పాకిస్థాన్కు వరంగా మారింది. ఈ నది తీర ప్రాంతంలో తవ్వేకొద్ది కేజీఎఫ్కు మించిన టన్నుల బంగారం బయటపడుతోంది. 80 వేల కోట్ల బంగారు నిల్వలు ఉన్నట్లు అక్కడి జియోలజికల్ సర్వే గుర్తించింది. అయితే ఆ బంగారం భారత్కు చెందిందేనని చర్చ నడుస్తోంది.
పెద్ద ఎత్తున బంగారం తవ్వకాలు..
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో సింధు నది ఒడ్డున పెద్ద ఎత్తున బంగారం తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కుండ్ నుంచి నిజాంపూర్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో భారీగా బంగారం నిక్షేపాలు ఉన్నట్లు పాకిస్తాన్ జియోలాజికల్ సర్వే కనుగొంది. దాని విలువు దాదాపు 80 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేసింది. పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ ఫంఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్లలో సైతం బంగారం నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు. అటోక్ జిల్లాలోని సింధు నదిలో బంగారం నిల్వలను వెలికితీసే ప్రక్రియపై పూర్తి దృష్టి పెట్టామని పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ప్రకటించారు. పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు.
హిమాలయాలే కారణం..
పాకిస్తాన్లోని సింధు నది పరివాహక ప్రాంతంలో భారీ స్థాయిలో బంగారం దొరకడానికి హిమాలయాలే కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సింధు నది హిమాలయాల్లో జన్మించి పాకిస్తాన్ మీదుగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. హిమాలయాల దిగువన టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఆ చర్యల వల్లే అక్కడ బంగారం అణువులు ఏర్పడుతుంటాయి. అవి సింధు నది ప్రవాహం ద్వారా పాకిస్థాన్లోని నదీ పరివాహక ప్రాంతం పరిధిలో వ్యాపిస్తుంటాయి. వందల ఏళ్లతరబడి నిరంతరాయంగా సింధు నది ప్రవాహం జరిగిన ఫలితంగా ఈ బంగారం అణువులన్నీ నదీ లోయలో పలుచోట్ల పేరుకుపోతుంటాయి. ఈ కారణంగా సింధు నదిలో దొరుతున్న బంగారంపై భారత్కే హక్కు ఉంటుందని వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఆ బంగారాన్ని తీసుకోవడానికి ఇండియాకు ఎలాంటి అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చూడండి: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!
అంతర్జాతీయ చట్టాల ప్రకారం పాకిస్తాన్లో ప్రవహించే సింధు నదిలో దొరికిన బంగారంపై భారత్కు ఎలాంటి హక్కు ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో మొత్తం బంగారం పాకిస్తాన్కే చెందుతుంది. పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు పెరగడంతో పాక్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఒక్కసారి బంగారం వెలికితీత ప్రక్రియ మొదలైతే అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పాకిస్తాన్ కరెన్సీ విలువ కొంత మేర మెరుగుపడుతుంది. దీంతో ధరలు దిగొచ్చి సామాన్య ప్రజలకు ఊరట లభించే అవకాశం ఉంది.
ఇది కూడా చూడండి: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..