/rtv/media/media_files/2025/02/27/IAiOWfunAGD11Fh5Zb0j.jpeg)
SLBC Tunnel
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ లో కార్మికులు చిక్కుపోయి ఐదు రోజులు అయిపోయింది. అప్పటి నుంచీ వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, బీఆర్వో, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ, ఎల్అండ్టీ తదితర ప్రఖ్యాత సంస్థల బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి. నిన్న సాయంత్రానికి టన్నెల్ చివర వరకు కూడా వెళ్లగలిగారు. అయితే ఎక్కడా కార్మికుల జాడ మాత్రం కనిపించలేదు. ఎటుచూసినా మట్టి దిబ్బలు, బురదే కనిపిస్తోంది. దానికి తోడు టన్నెల్లో ప్రతి నిమిషానికి ఐదు వేల లీటర్ల నీళ్లు ఊరుతుండటం, ఇప్పటికే భారీగా బురద, రాళ్లు మేటవేసి ఉండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది.
జారిపడుతున్న మట్టి పెళ్ళలు..ఊరుతున్న నీరు..
ఎంత దూరం వెళ్ళినా శిథిలాలే కనిపిస్తున్నాయి తప్ప ఎనిమిది మంది కార్మికుల జాడ కనిపించడం లేదని చెబుతున్నారు ఆర్మీ, ర్యాట్ హోల్ మైనర్స్. టన్నెల్ ఎత్తు 10.2 మీటర్లు అయితే ప్రమాదం జరిగిన చోట దాదాపు 9.2 మీటర్ల ఎత్తులో మట్టి దిబ్బలున్నాయి. అందులోనే టీబీఎం మిషన్ కూడా కూరుకుపోయింది. గాలి కోసం ఏర్పాటు చేసిన భారీ పైపు కూడా కూలి టీబీఎం మిషిన్ మీద పడింది. దీంతో ఎనిమిది మంది కార్మికులు బతికుండడంపై మరిన్ని అనుమానాలు ముసురుకున్నాయి. గల్లంతైన వారు టీబీఎం మిషన్ చుట్టూ బురదలో కూరుకుపోయి ఉంటారని చెబుతున్నారు.
ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్మీ ఏడో రెజ్మెంట్ టీమ్కు చెందిన ఏడీజీ ర్యాంక్ ఆఫీసర్ బుధవారం లీడ్ తీసుకున్నారు. ఆయన నేతృత్వంలో రెస్క్యూ టీమ్ అంతా టన్నెల్ లోపలికి వెళ్లగలిగారు. దాదాపు 11 కిలోమీటరు వరకు లోకో ద్వారా చేరుకున్నారు. అక్కడి నుంచి నీరు, బురద చాలా ఎక్కువగా ఉండడంతో థర్మోకోల్షీట్లు, వెదురు బొంగులు, రబ్బర్ ట్యూబులు, తాళ్లను ఉపయోగిస్తూ ముందుకు కదిలారు. మధ్యలో ఇద్దరు ఆర్మీ జవాన్లు స్కిడ్ అయి దాదాపు మోకాళ్ల లోతు బురదలో కూరుకుపోయారు కూడా. పైనుంచి సీపేజి వలన మట్టి పెళ్ళలు ఊడిపడుతూనే ఉన్నాయి. కింద నుంచి నీరు ఊరుతోంది. దీంతో అక్కడి పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయి. టీబీఎం మిషన్ 150 మీటర్ల పొడవు ఉండగా.. ఇది దాదాపు తొమ్మిది మీటర్లు మట్టిలో కూరుకుపోయినట్లు గుర్తించారు. అలాగే ఆక్సిజన్ కోసం ఏర్పాటు చేసిన పైపు పగిలి టీబీఎం మిషిన్ మీద పడి ఉండటాన్ని గమనించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎనిమిది కార్మికులు బతికి ఉంటారనుకోవడం కష్టమేనని రెస్క్యూ టీమ్ చెబుతోంది.
Also Read: Hyd: ఐదు రోజులు ఎండ దంచికొడుతుంది..జాగ్రత్త అంటున్న వాతావరణశాఖ