/rtv/media/media_files/2025/02/23/PVVWUlnKHg70hFrpjKiz.jpg)
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆర్మీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నుంచి 23 మందితో కూడుకున్న టీం ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుంది. కార్మికులను రక్షించేందుకు వారు పలు రకాల ప్లాన్లు వేస్తున్నారు. మరోవైపు ఎంతో కష్టపడి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు చేరుకున్నారు. టన్నెల్లో భారీగా బురద ఉండటం, శిథిలాలు ఉండటంతో రెస్క్యూకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ప్రమాదం జరిగి ఇప్పటికే 24 గంటలు అవుతుండటంతో బాధితుల కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.
2025 ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 8-9 గంటల మధ్య టన్నెల్లో మట్టి కూలడం మొదలైంది. వెంటనే కొంతమంది బయటికి వచ్చినా ఎనిమిది మంది మాత్రం అక్కడే చిక్కుకున్నారు. సముద్ర మట్టానికి 834 అడుగుల దిగువన కార్మికులు ఇందులో చిక్కుకుపోవడంతో వారికి ఆక్సిజన్ అందుతుందా లేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. సహాయక చర్యలపై నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పాల్గొన్నారు. టన్నెల్ లో చిక్కుకున్న వారిలో మనోజ్, శ్రీను, సందీప్,జట్కాస్, అనుసాహు, సంతోష్, సన్నీ సింగ్, గురుప్రీత్ సింగ్ ఉన్నారు.
మరికాసేపట్లో టన్నెల్ వద్దకు మంత్రలు ఉత్తమ్, జూపల్లి చేరుకోనున్నారు. ప్రస్తుతం దోమలపెటలో అధికారులు రెస్క్యూ టీమ్ తో అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. టన్నెల్ లో ఉన్న నీటిని బయటకు పంపించేందుకు చర్చలు నడుస్తున్నాయి. దీనికి కనీసం 4 గంటల సమయం పడుతుందని మంత్రులకు సమాధానం ఇచ్చారు ఏజెన్సీ ప్రతినిధులు. ఎనిమిది మంది ప్రాణాలను కాపాడుతామని మంత్రి ఉత్తమ్ హామీ ఇస్తున్నారు.
మోదీ, రాహుల్ ఫోన్
మరోవైపు ఇదే ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. ఘటనపై ఆరా తీశారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సీఎంకు సూచించారు. ప్రధాని మోదీ సైతం శనివారం రేవంత్ కు ఫోన్ చేసి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.