Moinabad drugs case :  మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసు...విచారణకు సిట్‌ ఏర్పాటు

ఇటీవల అత్యంత చర్చనీయంశంగా మారిన మెయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణకు సంబంధించి ప్రభుత్వం 9మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
FotoJet (13)

Moinabad drugs case

Moinabad drugs case :  ఇటీవల అత్యంత చర్చనీయంశంగా మారిన  మెయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణకు సంబంధించి ప్రభుత్వం 9 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. సీపీ సుధీర్‌ బాబు నేతృత్వంలోని ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం డ్రగ్స్‌ కేసును దర్యాప్తు చేయనుంది. బీఆర్‌ఎస్‌ తాండూరు మాజీ ఎమ్మెల్యే అయిన పైలట్‌ రోహిత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌లో ఇటీవల జరిగిన మద్యం పార్టీ సంచలనంగా మారింది. ఆ పార్టీలో డ్రగ్స్‌ వినియోగిస్తున్నారన్న విశ్వసనీయ సమచారంతో గత శనివారం తెలంగాణ ఈగల్‌ టీం పోలీసులు ఫామ్‌ హౌస్‌ పై దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 11 మంది పట్టు బడ్డారు. వారికి రక్త పరీక్షలు నిర్వహించగా వారిలో ఆరుగురు డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేలింది. డ్రగ్స్‌ పాజిటివ్‌ వచ్చినవారిలో మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డితో పాటు ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ కూడా ఉన్నట్లు గుర్తించారు. దీనితో పాటు పోలీసులు ఫాంహౌస్‌లో తనిఖీలకు వెళ్లిన సమయంలో ఢిల్లికి చెందిన నమిత్‌ శర్మ అనే వ్యక్తి పోలీసులు లక్ష్యంగా కాల్పులు జరపడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
 
పోలీసులు సోదాలు చేయకుండా వారిని అడ్డుకోవడం కోసమే రోహిత్‌రెడ్డి ఆదేశాలతోనే ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. కాగా ఈ విషయమై మొయినాబాద్‌ ఠాణాలో 11 మందిపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించారు. అందులో రోహిత్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఆయనతోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేయగా మిగిలిన 8 మందికి స్టేషన్‌ బెయిలు మంజూరు చేశారు.  ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో  రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మలను ఉప్పర్‌పల్లిలో జడ్జి ముందు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు చీఫ్‌గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నియమించారు. ఇక సభ్యులుగా గ్రేహౌండ్స్ కమాండర్ రవీందర్ రెడ్డి, షాద్‌నగర్ డీసీపీ శిరీష, ఈగల్ డీఎస్పీలు బుచ్చయ్య, హరీశ్ చంద్రారెడ్డి, మోయినాబాద్ ఎస్‌హెచ్‌వో మల్లిఖార్జున, ఎస్‌ఐలు కోటేశ్వర్‌ రావు, వెంకన్న, సదత్ అలీలు ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు