ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనం, కేబినేట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.ఇకపై ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగనున్నారు.దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఈ నిర్ణయంతో 43,373 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు అధికారులతో సబ్‌కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

New Update
ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనం, కేబినేట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం

మూడు,నాలుగేళ్లలో హైదరాబాద్‌ మెట్రో వ్యవస్థ సిటీ మొత్తం విస్తరించేలా కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్‌ తెలిపారు. రాయదుర్గం - శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు టెండర్‌ ప్రక్రియ జరుగుతోందన్నారు. ఇస్నాపూర్‌ నుంచి మియాపూర్‌ వరకు మెట్రో విస్తరణ, మియాపూర్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు, ఎల్బీనగర్‌ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు, ఉప్పల్‌ నుంచి బీబీనగర్‌,ఈసీఐఎల్‌ వరకు మెట్రో విస్తరణకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్‌నగర్‌ వరకు మెట్రో విస్తరణ చేపడతామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇక జేబీఎస్‌ నుంచి తూంకుంట, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్‌ డెక్కర్‌ మెట్రో నిర్మాణం చేపడతామన్నారు. గవర్నర్‌ తిప్పి పంపిన బిల్లులను మళ్లీ అసెంబ్లీలో పెడతామని ఈసారి గవర్నర్‌ ఆమోదించక తప్పదని మంత్రి తెలిపారు. గవర్నర్‌తో మనకు పనిలేదని మంత్రి కేటీఆర్ అన్నారు.

నష్టపోయిన వారికి తక్షణ సాయం కింద రూ.500 కోట్లు విడుదల

జులై 18 నుంచి 28 వరకు రాష్ట్రంలో పెద్దఎత్తున వర్షాలు కురిశాయి. వర్షాలు, వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. తెలంగాణ జిల్లాల్లోని రైతులు, ప్రజలకు తలెత్తిన తీవ్ర నష్టంపై కేబినెట్‌లో చర్చించామన్నారు. తక్షణ సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇద్దరు విద్యుత్‌ ఉద్యోగులు ఉద్యోగ ధర్మాన్ని అద్భుతంగా నిర్వర్తించారని కొనియాడారు. వీరిద్దరికి ఆగస్టు 15న ప్రభుత్వ సత్కారం చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే ఆశ్రమ పాఠశాలలో 40 మంది పిల్లలను కాపాడిన టీచర్‌ను సన్మానిస్తామని వివరించారు.తెలంగాణలో మరో 8 మెడికల్‌ కాలేజీలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రతి జిల్లాలో ఒక మెడికల్‌ కాలేజీ ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. గవర్నర్‌ కోటా కింద కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌కి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పంట నష్టం పై పూర్తి నివేదిక అందాక నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం తెలిపారు.కేంద్రం రాజకీయం చేసుడు బంద్ చేసి రాష్ట్రానికి సహాయం చేయాలని కోరారు.

రూ.60వేల కోట్లతో హైదరాబాద్‌ మెట్రో విస్తరణ

రూ.60వేల కోట్లతో హైదరాబాద్‌లో మెట్రోను విస్తరించనున్నట్లు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. కేబినెట్‌ సమావేశం అనంతరం మంత్రులతో కలిసి ఆయన కేబినెట్‌ నిర్ణయాలను వివరించారు.  భారతదేశంలోనే అద్భుతమైన నగరంగా ఎదిగింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల్లో హైదరాబాద్‌ అగ్రభాగాన ఉంది. టార్చ్‌బేరర్‌గా ఉంది. ప్రజారవాణాను విస్తృత పరచడం ద్వారా నగరం ఎంత పెరిగినా ఎన్ని పరిశ్రమలు వచ్చినా, లక్షలాది మంది ప్రజలు వచ్చినా తట్టుకునేలా విశ్వనగరంగా ఎదగడానికి, అన్నిహంగులతో కూడిన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుందన్నారు.

డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని కేబినెట్‌ నిర్ణయం

ఇప్పటికే రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 70 కిలోమీటర్ల మెట్రోకు అదనంగా 31 కిలోమీటర్లు ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రూపంలో అందుబాటులోకి రాబోతుంది. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం మేరకు.. జూబ్లీ బస్టాండ్‌ వరకు తూంకుంట వరకు దాకా డబుల్‌ డెక్కర్‌ మెట్రోను ఏర్పాటు చేయబోతున్నది. ఒక లెవల్లో వాహనాలు, మరో లెవల్లో మెట్రో ఏర్పాటు చేయడానికి కేబినెట్‌ తీర్మానించింది. ప్యాట్నీ నుంచి కండ్లకోయ దాకా డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని కేబినెట్‌ నిర్ణయించింది. విజయవాడ రూట్‌లో ప్రస్తుతం ఉన్న మెట్రోను ఎల్‌బీనగర్‌ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు హయత్‌నగర్‌ విస్తరించాలని, వరంగల్‌ రూట్‌లో ఉప్పల్‌ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌ వరకు, మహబూబ్‌నగర్‌ మార్గంలో భవిష్యత్‌లో కొత్తూరు నుంచి షాద్‌నగర్‌ వరకు విస్తరించాలని నిర్ణయించింది. ఉప్పల్‌ నుంచి ఈసీఐఎల్‌ క్రాస్‌ రోడ్డు వరకు, ఓల్డ్‌ సిటీ మెట్రోను పూర్తి చేస్తాం. ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఎయిర్‌పోర్టు నుంచి కందుకూరు వరకు మొత్తం కలిపి రూ.60వేలకోట్లతో మెట్రోను రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు.

2024 తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం

నాలుగైదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ పురపాలకశాఖను ఆదేశించారు. వీటిపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసి, వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని సీఎం కేసీఆర్‌ మెట్రో రైల్‌ అథారిటీ, మున్సిపల్‌ శాఖను ఆదేశించారు. హైదరాబాద్‌ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రజా రవాణాను భారత్‌లోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్‌ సంకల్పం మేరకు పెద్ద ప్రాజెక్టును తీసుకోబోతున్నాం. కేంద్రం ప్రభుత్వం సైతం సహకరిస్తుందని ఆశిస్తున్నాం. సహాయం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుంది.  కేంద్రంలో 2024 తర్వాత సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. అందులో బీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోశించనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు