Telangana : ఆట మొదలైంది..ఇక మిగిలింది తెలంగాణే

ఐదు రాష్ట్రాల ఎన్నికల పర్వం ముగియడంతో, బీజేపీ అగ్ర నాయకత్వం ఇప్పుడు దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా కర్ణాటక, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాగా వేయడం 2029 సార్వత్రిక ఎన్నికల లక్ష్యానికి అత్యంత కీలకమని పార్టీ భావిస్తోంది.

New Update
New Telangana BJP President Likely to be Announced soon

BJP target on Telangana

Telangana :  భారతీయ జనతా పార్టీ తన రాజకీయ వ్యూహాలను నిరంతరం మారుస్తూ, రాబోయే సవాళ్లకు సిద్ధమవుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల పర్వం ముగియడంతో, పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పుడు దక్షిణాది, కీలక ఉత్తరాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా కర్ణాటక, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాగా వేయడం 2029 సార్వత్రిక ఎన్నికల లక్ష్యానికి అత్యంత కీలకమని పార్టీ భావిస్తోంది. వచ్చే రెండేళ్లలో దాదాపు 16 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు కొత్త రాష్ట్రాల్లో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.

పంజాబ్,కర్ణాటక రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు బీజేపీకి సవాలుగా మారాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీని బలహీనపరిచేందుకు ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ఆకర్షించే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరోవైపు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో స్థానిక వ్యూహాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణపై పార్టీ హైకమాండ్ మరింత ఆశలు పెట్టుకుంది. ఈ నెల 10న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన కేవలం అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభానికే పరిమితం కాకుండా, రాజకీయంగా కేడర్‌లో ఉత్సాహం నింపేలా భారీ ప్రకటనలతో సాగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కేంద్ర మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ అంశం ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పనితీరు సరిగా లేని పలువురు మంత్రులకు ఉద్వాసన పలికి, వారిని పార్టీ సంస్థాగత బాధ్యతలకు పరిమితం చేయాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త రక్తాన్ని నింపడం ద్వారా అటు ప్రభుత్వంపై సానుకూలత పెంచడంతో పాటు, ఇటు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యత కల్పించాలనేది కేంద్రం ఆలోచన. ఈ విస్తరణలో ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి బలమైన రాష్ట్రాలతో పాటు, ఎన్నికల లక్ష్యంగా ఉన్న తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ నేతలకు కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉంది.

రాబోయే ఎన్నికల క్యాలెండర్‌ను పరిశీలిస్తే.. 2026లో ఉత్తర ప్రదేశ్‌, గుజరాత్‌ వంటి కీలక రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడం, అలాగే 2028 నాటికి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో పట్టు సాధించడంతో పాటు తెలంగాణ, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో గెలుపు జెండా ఎగురవేయడం బీజేపీకి అనివార్యంగా మారింది. ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ప్రాంతీయ సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ, అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూనే.. వ్యవస్థాగత మార్పుల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే మోదీ-షా ద్వయం తక్షణ కర్తవ్యంగా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు