/rtv/media/media_files/2026/04/17/russia-drone-2026-04-17-07-56-16.jpg)
ఉక్రెయిన్పై రష్యా మరోసారి నిప్పుల వర్షం కురిపించింది. గత రెండు వారాల్లో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో గగనతల దాడులకు పాల్పడింది. జనావాసాలే లక్ష్యంగా సుమారు 700 డ్రోన్లు, వందలాది క్షిపణులతో విరుచుకుపడటంతో ఉక్రెయిన్ అతలాకుతలమైంది. ఈ దాడుల వెనుక పాశ్చాత్య దేశాలకు రష్యా గట్టి హెచ్చరికలు పంపినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రష్యా జరిపిన ఈ దారుణ దాడుల్లో(russia ukraine drone attack) ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాంబుల తాకిడికి 17 అపార్ట్మెంట్ భవనాలు, 10 ప్రైవేట్ ఇళ్లు, ఒక షాపింగ్ మాల్, హోటల్ పూర్తిగా దెబ్బతిన్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన ఈ దాడులు గంటల తరబడి కొనసాగడంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోయారు.
Also Read : అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు.. మాకేం తెలియదంటున్న పాక్
ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వీరోచిత పోరాటం
శత్రువు పంపిన మారణాయుధాలను అడ్డుకోవడంలో ఉక్రెయిన్ వైమానిక దళం శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. రష్యా ప్రయోగించిన వాటిలో 667 డ్రోన్లను (వీటిలో 636 షహెద్ తరహా డ్రోన్లు ఉన్నాయి) గాలిలోనే పేల్చివేసింది. 31 క్షిపణులను లక్ష్యాన్ని చేరకముందే ధ్వంసం చేసింది. అయితే, ఎయిర్ డిఫెన్స్ కళ్లుగప్పి కొన్ని క్షిపణులు జనావాసాలపై పడటంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.
జెలెన్స్కీ పర్యటనే కారణమా?
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఇటీవల జర్మనీ, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటించారు. తమ దేశ రక్షణ కోసం అత్యాధునిక 'ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్' అందించాలని ఆయా దేశాలను కోరారు(Big twist in Russia Ukraine War). ఈ పర్యటన ముగిసిన వెంటనే రష్యా ఈ స్థాయిలో విరుచుకుపడటం గమనార్హం. జెలెన్స్కీ పర్యటనకు ప్రతిచర్యగానే పుతిన్ ఈ విధ్వంసానికి దిగినట్లు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : హర్మూజ్ వైపు అమెరికా.. దక్షిణ చైనా సముద్రంపై కన్నేసిన చైనా
ఐరోపా దేశాలకు రష్యా వార్నింగ్
కేవలం ఉక్రెయిన్తోనే కాకుండా, ఆ దేశానికి సహకరిస్తున్న ఐరోపా దేశాలపై కూడా రష్యా తన ప్రతాపం చూపిస్తామని హెచ్చరించింది. ఉక్రెయిన్ కోసం డ్రోన్లు, క్షిపణులు మరియు ఇతర సైనిక సామగ్రిని తయారు చేస్తున్న యూరప్ దేశాలను తమ తదుపరి లక్ష్యంగా చేసుకుంటామని రష్యా హెచ్చరించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం బాధితులకు వైద్య సహాయం అందించడంతో పాటు, ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే పనిలో ఉక్రెయిన్ ప్రభుత్వం నిమగ్నమైంది. ప్రపంచ దేశాలు ఈ హింసను ఆపాలని కోరుతున్నప్పటికీ, యుద్ధ జ్వాలలు మాత్రం చల్లారడం లేదు.
Follow Us