/rtv/media/media_files/2026/03/31/pakistan-facing-a-severe-energy-crisis-following-middle-east-tensions-2026-03-31-13-36-05.jpg)
Pakistan facing a severe energy crisis following Middle East tensions
మిడిల్ఈస్ట్లో ముదురుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం, హర్మూజ్ జలసంధి వద్ద అంతరాయం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపించింది. చాలా దేశాల్లో గ్యాస్, చమురు కొరత నెలకొంది. అయితే ఈ ఎఫెక్ట్ పొరుగు దేశమైన పాకిస్థాన్పై తీవ్రంగా పడింది. ఆ దేశంలో ముడి చమురు నిల్వలు తగ్గిపోవడంతో షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 'చమురు పొదుపు' ఎమర్జెన్సీని ప్రకటించింది.
ప్రజలు ఇళ్లకే పరిమితం
చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించడం, విదేశీ మారకద్రవ్య నిల్వలను ఆదా చేసేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పలు ఆంక్షలు అమలు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తప్పనిసరి చేసింది. వారానికి నాలుగు రోజుల పనిదినాలనే అనుసరిస్తోంది. రవాణా ఇంధనాన్ని మరింత పొదుపు చేసేందుకు పాఠశాలలు, కళాశాలలను రెండు వారాల పాటు మూసివేసింది. విద్యార్థులకు పాఠాలను ఆన్లైన్ ద్వారా బోధించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడం వల్ల పెట్రోల్, డీజిల్ వాడకాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పాక్ సర్కార్ భావిస్తోంది.
Also Read: హర్మూజ్లో అధికారికంగా టోల్ వసూలు చేయనున్న ఇరాన్.. ఒక్క నౌకకు ఎన్ని కోట్లంటే ?
సంపన్న వర్గాలకు విజ్ఞప్తి
దేశంలో ఉన్న సంపన్న వర్గాలకు పాక్ ప్రభుత్వం ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. వాహనాల వాడకాన్ని తగ్గించాలని.. దేశానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చింది. 'ది డాన్' పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం.. రాబోయే రోజుల్లో చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే ముప్పు ఉందని హెచ్చరించింది. ప్రజలు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రజలు రెడీగా ఉండాలని కోరింది.
ప్రస్తుతం అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరల వల్ల పాకిస్థాన్లో పెట్రోల్ ధరలు 24.4 శాతం పెరిగాయి. డీజిల్ ధరలు 21.8 శాతం పెరిగాయి. ప్రస్తుతం అక్కడి లీటర్ పెట్రోల్ ధర రూ.321.17 (పాకిస్థానీ కరెన్సీ) కాగా డీజిల్ లీటరుకు రూ.335.86 ఉంది. ఇవి మన భారత కరెన్సీలో లీటర్ పెట్రోల్కు రూ.109, డీజిల్కు రూ.114గా ఉంది. అయితే పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: సంచలన అప్డేట్.. ఇరాన్పై అణుబాంబులు వేసేందుకు సిద్ధమవుతున్న అమెరికా
రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని విలాసాలకు ఖర్చు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 300 (పాకిస్థానీ రూపాయిలు) దాటడంపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేకతను చల్లార్చడం కోసం, అలాగే భారీ నిరసనలు జరగకుండా చూసేందుకే.. అక్కడి ప్రభుత్వం ప్రజలను ఇళ్లలోనే ఉంచేలా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గకుంటే పాక్ ఆర్థిక వ్యవస్థ మరింత పతనమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Follow Us