/rtv/media/media_files/2026/05/26/high-tension-on-the-west-bengal-bangladesh-border-2026-05-26-16-12-42.jpg)
Illegal Bangladeshi immigrants
West Bengal : పశ్చిమ బెంగాల్లో సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులపై నూతనంగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించిన 'గుర్తించు, తొలగించు, తిప్పి పంపు' (Detect, Delete and Deport) విధానం కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో తీవ్రమైన పరిపాలనాపరమైన చర్యలుగా రూపాంతరం చెందింది. ఈ కొత్త విధానంతో అక్రమ వలసదారుల్లో వణుకు మొదలైంది. దీంతో పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని వివిధ తనిఖీ కేంద్రాల (Checkposts) వద్ద తమ దేశానికి తిరిగి వెళ్లిపోయేందుకు అక్రమ వలసదారులు భారీ సంఖ్యలో గుమిగూడుతున్నారు. మంగళవారం ఉదయం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకీంపూర్ సరిహద్దు తనిఖీ కేంద్రం వద్దకు వందలాది మంది బంగ్లాదేశీ పురుషులు, మహిళలు చేరుకుని సరిహద్దు దాటేందుకు వేచి చూడటం అక్కడ నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది.
HUGE 🚨 Illegal Bangladeshi immigrants are going back to Bangladesh. They have gathered at border.
— News Algebra (@NewsAlgebraIND) May 26, 2026
Move comes days after Suvendu Adhikari pushed the “detect, delete and deport” drive.
Bengal govt has also started setting up holding centres for illegals. pic.twitter.com/FTy6zLex5Khttps://t.co/fvqFkYstQR
రాష్ట్రంలో అక్రమ వలసదారులను తాత్కాలికంగా ఉంచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గృహ, పర్వత ప్రాంతాల వ్యవహారాల శాఖకు చెందిన 'ఫారిన్ వింగ్' ఆదేశాల మేరకు జిల్లాల్లో హోల్డింగ్ సెంటర్ల (డిటెన్షన్ కేంద్రాల) ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఈ క్రమంలో మాల్దా జిల్లా రాష్ట్రంలోనే మొదటి హోల్డింగ్ సెంటర్ను ప్రారంభించి తొలి అడుగు వేసింది. ఇంగ్లీష్ బజార్ పట్టణంలోని చందన్ పార్క్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఇప్పటికే తొమ్మిది మంది అనుమానిత బంగ్లాదేశీయులను (ముగ్గురు మహిళలు, ఆరుగురు మైనర్లు) ఉంచారు. గాజోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాండువాలో పట్టుబడిన వీరిని ఆదివారం ఈ కేంద్రానికి తరలించారు. ఈ కేంద్రం వద్ద 24 గంటల సీసీటీవీ నిఘాతో పాటు 12 మంది పోలీసులు, సివిల్ డిఫెన్స్ సిబ్బంది, సివిల్ వాలంటీర్లతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ సరిహద్దు నిఘా,అక్రమ వలసదారుల ఏరివేత చర్యలను నూతనంగా అమల్లోకి వచ్చిన 'ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారనర్స్ యాక్ట్, 2025' తో అనుసంధానించారు. పాత చట్టాల స్థానంలో వచ్చిన ఈ కొత్త చట్టం సాంకేతిక ఆధారిత నిఘా, నిర్బంధం, దేశం నుండి బహిష్కరించే ప్రక్రియలకు పూర్తి అధికారాలను కల్పిస్తోంది. దీని ప్రకారం హెడ్ కానిస్టేబుల్ లేదా ఆపై స్థాయి పోలీస్ అధికారులకు నిబంధనలు ఉల్లంఘించినట్లు అనుమానం ఉన్న వ్యక్తులను ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్టు చేసే అధికారం లభించింది. ఈ చట్టం పరిధిలో అనుమానితులను 30 రోజుల పాటు హోల్డింగ్ సెంటర్లలో ఉంచి, జిల్లా మేజిస్ట్రేట్ సమక్షంలో బయోమెట్రిక్ వివరాల సేకరణ, పౌరసత్వ నిర్ధారణ పూర్తి చేసి, ఆ వివరాలను కేంద్ర డేటాబేస్లో అప్లోడ్ చేసిన అనంతరం వారిని స్వదేశానికి పంపిస్తారు.
ఈ అక్రమ వలసదారుల బహిష్కరణ ప్రక్రియ ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పౌరసత్వ సవరణ చట్టం (CAA) పరిధిలోకి రాని వారందరినీ అక్రమ వలసదారులుగా పరిగణించి, పోలీసులు వారిని అరెస్టు చేసి సరిహద్దు భద్రతా బలగాలకు (BSF) అప్పగిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చర్యలను స్వాగతిస్తూ ఉత్తర మాల్దా బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ము మాట్లాడుతూ.. రోహింగ్యాలు, ఉగ్రవాదులు,జిహాదీ మూఠాలకు పశ్చిమ బెంగాల్ ఒక సురక్షిత కారిడార్గా మారిపోయిందని, దేశ భద్రత దృష్ట్యా ఈ కఠిన చర్యలు అత్యవసరమని పేర్కొన్నారు.
అయితే, కేంద్ర ప్రభుత్వ మినహాయింపు ఉత్తర్వుల ప్రకారం పౌరసత్వ సవరణ చట్టం (CAA) రక్షణ ఉన్న వర్గాలకు ఈ చర్యల నుండి మినహాయింపు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిసెంబర్ 31, 2024 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి మతపరమైన వేధింపుల వల్ల భారత్కు వలస వచ్చిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్సీ, క్రైస్తవ మైనారిటీలకు ఈ చట్టం ద్వారా పూర్తి రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం సరిహద్దుల్లో పెరుగుతున్న రద్దీ, కట్టుదిట్టమైన హోల్డింగ్ సెంటర్ల నిర్వహణను బట్టి చూస్తే, రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్లో అక్రమ వలసదారుల గుర్తింపు, నిర్బంధం,బహిష్కరణ ప్రక్రియ మరింత వేగవంతం కానుందని స్పష్టమవుతోంది.
Follow Us