/rtv/media/media_files/2025/08/06/hyderabad-companies-provide-work-from-home-facility-2025-08-06-09-18-49.jpg)
Hyderabad Companies provide work from home facility
పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ నాటి పరిస్థితులు తప్పకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. నాడు కోవిడ్ సందర్భంగా అన్ని ఐటీ సంస్థల్లో వర్క్ ఫ్రం హోమ్ విధానం అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇపుడు కూడా పలు ఐటీ సంస్థలు మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ వైపు దృష్టి సారిస్తున్నాయి. కొన్ని బహుళ జాతి సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలని సూచిస్తే.. మరికొన్ని కంపెనీలేమో ఇంటి నుంచి పని చేయాలని సూచిస్తున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల నుంచి రావలసిన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ వంటి ఇంధన వనరులు అందక పోవడంతో పలు దేశాల్లో కొరత తీవ్రమైన సంగతి తెలిసిందే. మనదేశంలోనూ ఈ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఉద్యోగుల వాహన వినియోగం తగ్గించి వారికి వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని భావిస్తున్నాయి. మరి కొన్ని టెక్నాలజీ సంస్థలు నిత్యం ఉద్యోగులను పికప్, డ్రాప్ చేసేవారు. ఇపుడు ఈ సర్వీస్లనూ తగ్గించాయి.
పెట్రోల్తో పాటు ఎల్పీజీ సిలిండర్ల కొరత మూలంగా ఐటీ ఆఫీసు క్యాంటీన్లలో మెనూ తగ్గించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఐటీ సంస్థలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) తమ ఉద్యోగులకు మళ్లీ ఇంటి నుంచి పని, హైబ్రిడ్ వర్క్ మోడళ్లను అవలంబించాలని భావిస్తున్నాయి. ఐటీ హబ్లుగా పేరొందిన హైదరాబాద్, బెంగళూరు, పుణే, చెన్నై వంటి నగరాల్లో హైబ్రిడ్, వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అనుసరించేందుకు సిద్ధమయ్యాయి.
క్యాంటీన్లు, హాస్టల్స్ను వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ కారణంగా మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మియాపూర్ తదితర ఐటీ కారిడార్లలోని హాస్టల్స్లో కిచెన్లకు తాళాలు పడ్డాయి. ఆఫీసు క్యాంటీన్లలో వెండర్లు సేవలను నిలిపివేయడంతో పలు ఐటీ సంస్థలు ఉద్యోగులు ఆఫీసు క్యాంటీన్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నాయి. అంటే వీలైనంత వరకూ ఉద్యోగులు సొంత ఆహారాన్ని తెచ్చుకోవాలని (బ్రింగ్ యువర్ ఓన్ ఫుడ్) సూచిస్తున్నాయి. వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రమైన నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడని ప్రత్యామ్నాయ ఆహార విక్రేతలతో ఒప్పందం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి.
ఇదిలా ఉండగా కొన్ని ఎంఎన్సీ సంస్థలు ఆన్సైట్ వర్క్ విధానాన్ని ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేశాయి. ప్రధానంగా బడా ఐటీ సంస్థలు అమెరికా, అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలలో ఉద్యోగులను ఆన్సైట్కు పంపిస్తుంటాయి. అయితే తాజాగా నెలకొన్న పరిస్థితులు మూలంగా ఆయా దేశాల్లో ఉద్యోగులకు ప్రయాణ పరిమితులను అమలు చేస్తున్నాయి.
పలు ఎంఎన్సీ కంపెనీలు ఉద్యోగుల భద్రత కోసం ఆన్సైట్ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించాయి. ప్రధానంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, డెలాయిట్, కేపీఎంజీ, జేపీ మోర్గాన్, గోల్డ్మన్ సాక్స్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి ప్రధాన టెక్నాలజీ సంస్థలు ఉద్యోగుల భద్రత, వ్యాపార కొనసాగింపు భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. వీటిలో చాలా సంస్థలు ఇప్పటికే వర్క్ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.
Follow Us