Team India : 17 ఏళ్ళ కల నెరవేరింది.. విశ్వవిజేతగా భారత జట్టు

కోట్లాది భారతీయుల కల నెరవేరింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విజయం చేతుల్లోకి వచ్చింది. ఎట్టకేలకు రోహిత్ సేన ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ఎనిమిది పరుగుల తేడాతో టీమ్ ఇండియా విక్టరీ కొట్టింది.

New Update
Team India : 17 ఏళ్ళ కల నెరవేరింది.. విశ్వవిజేతగా భారత జట్టు

T20 World Cup : దాదాపు గెలవడం అసాధ్యం అనుకున్న తరుణంలో భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో టీమ్ ఇండియా (Team India) ను టీ 20 వరల్డ్‌కప్‌ ను ముద్దాడేలా చేశారు. చాలా బాగా ఆడుతున్న దక్షిణాఫ్రికా (South Africa) ను కట్టడి చేయడంలో బౌలర్లు పూర్తిగా సక్సెస్ అయ్యారు. చివరకు టీమ్ ఇండియా 17 ఏళ్ళ కలనెరవేర్చుకుంది. కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ నిరీక్షణ ఫలించింది. చివర వరకు నరాలు తెగే ఉత్కంఠతతో మ్యాచ్ సాగింది. చివరి ఓవర్ వరకు ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టం అయింది. అసలు సిసలైన ఫైనల్ మ్యాచ్ జరిగింది.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా ఆరంభం బాగానే చేసినా నాలుగు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టోర్నీ అంతా బాగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం చాలా తొందరగా ఔట్ అయిపోయాడు. తరువాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా అతి తక్కువ రన్స్‌కే పెవిలియన్స్‌కు చేరాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడాడు. స్కై తరువాత అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు వచ్చాడు. ఒక పక్క సంయమనంగా బ్యాటింగ్ చేస్తూనే అక్షర్ ఆడపాదడపా సిక్స్‌లు, ఫోర్లు కొడుతూ టీమ్ ఇండియా స్కోరును ముందుకు నడిపించారు. మరోవైపు కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తరువాత కాస్త దూకుడుగా ఆడి 76 పరుగుల దగ్గర వికెట్ కోల్పోయాడు. దీని తరువాత కూడా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగసేసరికి టీమ్ ఇండియా 176 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికాకు 177 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. 

రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలుపెట్టిన సౌత్ ఆఫ్రికా మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోయినా...తరువాత మాత్రం చాలా దూకుడుగా ఆడింది. డికాక్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్‌లు చితకొట్టారు. క్లాసెన్ అయితే 27 బంతుల్లో 52 పరుగులు చేశాడు. క్వింటన్‌ డికాక్‌ (39; 31 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌), స్టబ్స్‌ (31; 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్య (3/20), బుమ్రా (2/18), అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/20) అదరగొట్టారు. అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ తీశాడు. ఒకానొక దశలో సౌత్ ఆఫ్రికా వాళ్ళు గెలిచేస్తారు, కప్పు కొట్టేస్తారు అనే పరిస్థితి వచ్చింది. బాల్స్, పరుగులు సమానం కూడా అయిపోయాయి. కానీ భారత బౌలర్లు కీలకమైన వికెట్లు తీయడం, పరుగులు కట్టుదిట్టం చేయడంతో భారత విజయం ఖాయం అయింది.

Also Read :  టీమిండియాలో ఇద్దరూ ఇద్దరే! భారత క్రికెట్ చరిత్రలో పరుగుల పేజీలు వారివే!

Advertisment
Advertisment
తాజా కథనాలు