/rtv/media/media_files/2025/03/03/0OAKocbccEZCdlqQqZvw.jpg)
Baby
Vijayawada Infant Baby : మానవత్వం రోజురోజుకు మంటగలుస్తోంది. విజయవాడలో ఓ మహిళ చేసిన పనికి సభ్యసమాజం తలదించుకుంది. ఆ మహిళ ముక్కుపచ్చలారని శిశువును పబ్లిక్ టాయిలెట్లో వదిలివెళ్లింది.
కృష్ణలంక దగ్గర బాత్రూమ్కు వెళ్లిన మహిళ శిశువును లోపల వదిలేసింది. బాత్రూం కడిగేందుకు వెళ్లిన సిబ్బంది శిశువును గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన అధికారులు శిశువును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ముక్కుపచ్చలారని ఓ పసిబిడ్డను ఆ మహిళ పబ్లిక్ టాయిలెట్లో వదిలి వెళ్లడం అందరినీ కలిచివేసింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కృష్ణలంక వద్ద ఓ పబ్లిక్ టాయిలెట్ ఉంది. ఈ రోజు ఓ మహిళ తన బిడ్డతో సహా టాయిలెట్కు వెళ్లింది. ఆ తర్వాత బాత్రూమ్ లోపల పసిపాపను కింద పడుకోబెట్టి, ఎవరికీ కనిపించకుండా బకెట్ను అడ్డుగా పెట్టింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొంత సమయం తర్వాత టాయిలెట్ను శుభ్రం చేయడానికి వెళ్లిన శానిటరీ సిబ్బంది, పాప ఏడుపు విని గమనించడంతో ఈ విషయం బయటపడింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పాపను మెరుగైన వైద్యం కోసం పాత ప్రభుత్వ ఆస్పత్రి (Old GGH)కి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం పాప క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇక ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న కృష్ణలంక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా సీసీటీవీ (CCTV) ఫుటేజీని పరిశీలించగా, సదరు మహిళ ఒక ఆటోలో అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె ఆటో ఎక్కడ ఎక్కింది, ఎక్కడ దిగిందనే వివరాలు బయటకు వచ్చాయి. అయతే పాపను టాయ్లేట్లో వదిలేసిన అనంతరం ఆ మహిళ నేరుగా రైల్వేస్టేషన్కు వెళ్లి, అక్కడ ఓ రైలు ఎక్కి పారిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మహిళ ఎవరు? పాపను ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చింది? అనే కోణంలో గాలింపు ముమ్మరం చేశారు.
Follow Us