/rtv/media/media_files/2025/10/17/rape-2025-10-17-14-41-29.jpg)
Rape of a married woman
Visakha Express : విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఒక వివాహితపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండల కేంద్రానికి చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెంటచింతల గ్రామానికి చెందిన దంపతులు కొంతకాలంగా ఉపాధి నిమిత్తం విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం గత ఆదివారం సాయంత్రం సదరు వివాహిత విశాఖపట్నంలో 'విశాఖ ఎక్స్ప్రెస్' రైలు ఎక్కింది.
ఆమె జనరల్ బోగీలో ప్రయాణిస్తుండగా, అదే రైలులో ఉన్న ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆమెను మాటల్లో దించి, బలవంతంగా ఏసీ బోగీలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన బాధితురాలు, తన స్వగ్రామానికి చేరుకున్నాక మంగళవారం నాడు రెంటచింతల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైలులో జరిగిన ఘటన కాబట్టి, నిందితుడిని గుర్తించేందుకు రైల్వే పోలీసుల (GRP) సహకారం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. ఏసీ బోగీలో జరిగిన ఈ దారుణంపై తోటి ప్రయాణికులు లేదా రైల్వే సిబ్బంది ఎవరైనా గమనించారా? అనే కోణంలోనూ, రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగానూ నిందితుడి కోసం గాలిస్తున్నారు. రైలు ప్రయాణాల్లో మహిళల భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళన రేకెత్తిస్తోంది.
Follow Us