TTD: తిరుపతి ఆలయ తొక్కిసలాటపై మాజీ ఎపీ సీఎం జగన్ సంచలన పోస్ట్ పెట్టారు. ఘోరమైన ఘటనను సీరియస్గా తీసుకోకుండా తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందుతులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట జరిగి, 6గురు మరణించిన ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యల విషయంలో @ncbn గారి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది. చంద్రబాబుగారి నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ 6వ తారీఖు నుంచి 8వ…
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 12, 2025
అత్యంత దుర్మార్గంగా..
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట జరిగింది. 6గురు మరణించిన ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు నిర్లక్ష్య వైఖరికి ఇదొక నిదర్శనమని జగన్ అన్నారు. టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాలమీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా, స్థానిక కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణమని తేలిన నేపథ్యంలో కూడా విచారణ చేసి, జైల్లో పెట్టకుండా ఎందుకు విడిచిపెట్టారని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. సిలబస్, ఎగ్జామ్స్పై TGPSC కీలక నిర్ణయం!
జరిగిన ఘోరమైన ఘటనను సీరియస్గా తీసుకోలేదనేకదా అర్థం? తూతూమంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడ్డానికే కదా? శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు అని అడిగారు. తూతూమంత్రంగా తీసుకున్న ఆ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపలేదంటారా? సంబంధంలేని వారిపై సస్పెన్షన్ వేటు వేయడం, అరెస్టుచేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం ఏమిటన్నారు. మరికొందరిపై అసలు చర్యలే లేకపోవడం, ప్రభావంలేని సెక్షన్లతో కేసులు పెట్టడం, వెంటనే టీటీడీ ఛైర్మన్ను, ఈవోను, ఏఈఓను, ఎస్పీను, కలెక్టర్ను డిస్మిస్ చేయకపోవడం, ఇవన్నీ దోషులను కాపాడ్డానికే కదా అని ఆరోపించారు.
ఇంతకన్నా దిగజారుడు తనం ఏమైనా ఉంటుందా?
ప్రభుత్వం ఇంత అలసత్వం చూపినా చంద్రబాబు దాన్నికూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతోందన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ క్షమాపణ చెబితే అదే చాలు అన్నట్టుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే, మరోవైపు డిప్యూటీ సీఎం లేదు క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారు. ఇంతకన్నా దిగజారుడు తనం ఏమైనా ఉంటుందా? 6 గురు ప్రాణాలు కోల్పోతే ఆ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా? ఏమిటీ దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం, న్యాయం ఏమీ లేవా? భక్తుల మరణానికి కారకులైన వారికి ఇవేమీ వర్తించవా? సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలన్నారు.
టీటీడీలో తొక్కిసలాట జరిగి, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదు. చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన టీటీడీ ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా స్థానిక కలెక్టర్, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్లందరినీ వెంటనే డిస్మిస్ చేసి, వీరిపై కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని, దేవుని పట్ల మీ భక్తిని చాటుకోవాలి. లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహానికిగురికాక తప్పదని హెచ్చరించారు.