/rtv/media/media_files/2026/05/27/tension-in-gandhi-bhavan-leaders-kicked-in-front-of-ministers-2026-05-27-17-45-02.jpg)
Tension in Gandhi Bhavan....leaders kicked in front of ministers
GANDHI BHAVAN : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్లోని గాంధీభవన్ తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణ,ఎన్నికల అనంతర పరిణామాలపై చర్చించేందుకు పార్టీ సీనియర్ నేతలు ఇక్కడ ఒక కీలక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే, సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్ నేతలు పరస్పరం ఘర్షణకు దిగడంతో వాతావరణం ఒక్కసారిగా రసాభాసగా మారింది. మంత్రులు, అగ్రనేతల సమక్షంలోనే నేతలు భౌతిక దాడులకు దిగడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపింది.
ఈ వివాదానికి ప్రధాన కారణం ప్రోటోకాల్,సీటింగ్ అరేంజ్మెంట్ రగడ అని తెలుస్తోంది. సమావేశంలో సీనియర్ నేత, మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పక్కన కూర్చునే విషయంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, కార్వాన్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ అలీ హజారీ మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. మొదట ఇద్దరి మధ్య మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ గొడవ కాస్తా శృతిమించి, ఒకరినొకరు అసభ్య పదజాలంతో దూషించుకుంటూ మంత్రుల ముందే చొక్కాలు పట్టుకునే స్థాయికి చేరింది.ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఉస్మాన్ అలీ హజారీ, ఫిరోజ్ ఖాన్ను గట్టిగా తోసేయడంతో ఆయన నియంత్రణ కోల్పోయి ఒక్కసారిగా కిందపడిపోయారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ సమక్షంలోనే ఈ భౌతిక దాడి జరగడంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. మంత్రులు ఇరువర్గాలను శాంతపరిచేందుకు ప్రయత్నించినప్పటికీ, నాయకులు ఆవేశంతో ఒకరిపైకొకరు దూసుకెళ్లారు.
ఈ ఘర్షణ మరింత పెద్దది కాకుండా ఉండేందుకు అక్కడే ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) వెంటనే జోక్యం చేసుకుని ఇరువర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆవేశంలో ఉన్న నేతలు వీహెచ్ను కూడా పక్కకు తోసేసేందుకు ప్రయత్నించడంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. వెంటనే అప్రమత్తమైన మిగతా కాంగ్రెస్ నాయకులు, భద్రతా సిబ్బంది ఇరువర్గాల మధ్యలోకి దూరి నాయకులను విడదీయడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది.
గాంధీభవన్ లాంటి ప్రధాన పార్టీ కార్యాలయంలో, అది కూడా బాధ్యతాయుతమైన మంత్రుల ముందే నేతలు ఇలా బాహాబాహీకి దిగడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అసహనానికి, ఆగ్రహానికి గురయ్యారు. క్రమశిక్షణ లేని ఇలాంటి వాతావరణంలో సమీక్ష నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూ, సమావేశాన్ని మధ్యలోనే అర్థాంతరంగా ముగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం మంత్రులు, ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తితో సమావేశం నుంచి నిష్క్రమించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Follow Us