సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20 కి పైగా విభిన్న డొమైన్ల పనితీరును ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పరిశీలించింది. ఆయా రంగాలలో పనిచేస్తున్న నిపుణులు, సిబ్బందితో ముఖ్యమంత్రి సంభాషించారు.
తెలంగాణలో స్కిల్స్ డెవలప్మెంట్ పట్ల అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ముందుకొచ్చిన సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సెంట్రల్ కాలేజీతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది.
క్యాంపస్ పరిశీలన అనంతరం జరిగిన చర్చలు, సంప్రదింపుల మేరకు తెలంగాణలో స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి సమక్షంలో సింగపూర్ ఐటీఈ అధికారులు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ వీఎల్ వీఎస్ఎస్ సుబ్బారావు ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీఈ సింగపూర్ అకడమిక్, అడ్మిన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్విందర్ సింగ్, ఐటీఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలోనే హైదరాబాద్లో పర్యటించనుంది.
సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్ తోనూ సీఎం రేవంత్ టీమ్ విస్తృత చర్చలు జరిపింది.
సింగపూర్ పర్యటన అనంతరం స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ పాల్గొంటారు.