ఆంధ్రా 5 గ్రామాలు తెలంగాణలో కలపాలని.. అమిత్ షాకు మంత్రి తుమ్మల లేఖ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దశాబ్దం దాటినా, భద్రాచలం సరిహద్దు గ్రామాల విలీన అంశం మరోసారి చర్చనీయాంశమైంది. భద్రాచలం మండలానికి ఆనుకుని ఉండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

New Update
thummala

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దశాబ్దం దాటినా, భద్రాచలం సరిహద్దు గ్రామాల విలీన అంశం మరోసారి చర్చనీయాంశమైంది. భద్రాచలం మండలానికి ఆనుకుని ఉండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాయడం, అటు రాజ్యసభలో రేణుకా చౌదరి కేంద్రాన్ని నిలదీయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కీలక లేఖ రాశారు. భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలను (పురుషోత్తపట్నం, ఎట్పాక, పిచికలపాడు, కన్నాయిగూడెం, గుండాల) తెలంగాణలో విలీనం చేయాలని ఆయన కోరారు.

పాలనా సౌలభ్యం: ఈ గ్రామాలు భద్రాచలం టౌన్‌కు దగ్గరలో ఉండటం వల్ల, ప్రజలు ప్రతి అవసరానికి ఏపీలోని సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
గిరిజనుల సంక్షేమం: విలీనం ద్వారా గిరిజనుల చిక్కుముడులు వీడి, వారికి ప్రభుత్వ ఫలాలు అందుతాయి.
తక్షణ చర్యలు: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే దీనిపై ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని మంత్రి కోరారు.

పార్లమెంట్‌లో రేణుకా చౌదరి 

మరోవైపు, రాజ్యసభలో టీజీ ఎంపీ రేణుకా చౌదరి తెలంగాణ హక్కుల కోసం గళమెత్తారు. ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో ఆమె పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. "తెలంగాణలో ఉండాలని కోరుకున్న ప్రజలను బలవంతంగా ఏపీలో కలిపారు. ఆ ఐదు గ్రామాలను వెంటనే తెలంగాణకు అప్పగించాలి. విభజన హామీలను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటూ తెలంగాణకు మొండిచేయి చూపుతున్నారు" అని ఆమె ధ్వజమెత్తారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ వంటి విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని, ఈ ఆలస్యం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.

విలీనం ఎందుకు ముఖ్యం?

భద్రాచలం పట్టణం ప్రస్తుతం కేవలం కొద్దిపాటి వైశాల్యంతోనే మిగిలిపోయింది. పట్టణ విస్తరణకు భూమి లేకపోవడం, రామాలయ అవసరాలకు స్థలం కొరత ఉండటం తెలంగాణ ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఏపీలో ఉన్న ఈ ఐదు గ్రామాలు భద్రాచలం మున్సిపాలిటీ పరిధిలోకి వస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్థానికులు కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం అటు రాష్ట్ర మంత్రి, ఇటు పార్లమెంట్ సభ్యురాలు ఇద్దరూ ఒకే అంశంపై కేంద్రాన్ని ఒత్తిడి చేయడంతో మోదీ ప్రభుత్వం ఈ విజ్ఞప్తిపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisment
తాజా కథనాలు