/rtv/media/media_files/2025/01/03/8Q9WL4Nsx5dNwqcooQZ1.jpg)
CM Revanth Reddy Review on RRB
పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అవమానం జరిగిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్ (పద్మవిభూషణ్), చుక్కా రామయ్య (పద్మభూషణ్), అందెశ్రీ (పద్మభూషణ్), గోరటి వెంకన్న (పద్మశ్రీ), జయధీర్ తిరుమలరావు (పద్మశ్రీ) వంటి ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని సీఎం అన్నారు. మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి ఎ..రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణకు పద్మ పురస్కారాల్లో జరిగిన అన్యాయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ సమాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్నలను గుర్తించకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనని సీఎం రేవంత్ అన్నారు. 139 మందికి పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కనీసం అయిదు పురస్కారాలు ప్రకటించకపోవడం అన్యామని వాపోయారు.
మరోవైపు పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి ఎంపికైన ప్రముఖులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. వైద్యరంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ డి. నాగేశ్వర్రెడ్డికి పద్మవిభూషణ్, సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్, ప్రజా వ్యవహారాల విభాగంలో మంద కృష్ణ మాదిగకు, కళలు, సాహిత్యం, విద్యా విభాగాల్లో కే.ఎల్.కృష్ణ, మాడుగుల నాగఫణిశర్మ, దివంగత మిర్యాల అప్పారావు, రాఘవేంద్రాచార్య పంచముఖిలకు పద్మశ్రీ పురస్కారాలు దక్కడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. తాము ఎంచుకున్న రంగంలో వారు చేసిన కృషి.. అంకితభావమే వారిని దేశంలోని ఉన్నత పురస్కారాలకు ఎంపికయ్యేందుకు కారణమయ్యాయని ముఖ్యమంత్రి అన్నారు.