Telangana Cabinet: ఈనెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 29న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయింది. ఎన్నికల నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించనుందని తెలుస్తోంది.

New Update
Telangana Cabinet: ఈనెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Telangana Cabinet: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 29న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయింది. ఎన్నికల నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించనుందని తెలుస్తోంది. అలాగే గవర్నర్ కోటా కింద ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళిసై తిరస్కరించిన నేపథ్యంలో దానిపై ప్రధానంనగా చర్చించే అవకాశముంది. గవర్నర్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేయాలా..? లేదా ఇతరులను నామినేట్ చేయాలా..? అనే దానిపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపైనా చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోపైనా చర్చించినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

గవర్నర్ నిర్ణయంపై ప్రధానంగా చర్చ..

గవర్నర్ నిర్ణయంపై ఇప్పుటికే బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శలు చేశారు. తమిళిసై బీజేపీ నాయకురాలిగా పనిచేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారని అలాంటి వారిని గవర్నర్‌గా నియమించవచ్చా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ గవర్నర్ మోదీ ఎజెండాగా పనిచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. గవర్నర్‌ అయ్యే ఒక్కరోజు ముందు కూడా తమిళిసై బీజేపీ రాష్ట్ర శాఖకు అధ్యక్షురాలిగా పని చేశారన్నారు. తమిళిసైని గవర్నర్ గా నియమించడం సర్కారియా కమిషన్‌ నిబంధనలకు విరుద్ధమని ధ్వజమెత్తారు. దీంతో మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ నిర్ణయంపై ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం.

మంత్రివర్గం నిర్ణయాలపై ఉత్కంఠ..

ఇప్పటికే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని.. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 3,4,5 తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అలాగే పెండింగ్ పనులను పూర్తి చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రివర్గంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 115 అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన సీఎం కేసీఆర్ దసరా పండుగ తర్వాత మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.

ఇది కూడా చదవండి: మోదీ తెలంగాణ టూర్ ఫిక్స్.. పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు