Cricket: రెండో మ్యాచ్‌లో జింబాబ్వేను చిత్తు చేసిన టీమ్ ఇండియా

మొదటి మ్యాచ్‌లో మన కుర్రాళ్ళును జింబాబ్వే ఓడిస్తే...రెండో మ్యాచ్‌లో వాళ్ళను చిత్తు చేశారు టీమ్ ఇండియా ఆటగాళ్ళు. 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. హరారేలో ఈ మ్యాచ్ జరిగింది.

New Update
Cricket: రెండో మ్యాచ్‌లో జింబాబ్వేను చిత్తు చేసిన టీమ్ ఇండియా

India vs Zimbabwe: ప్రస్తుతం టీమ్ ఇండియా జింబాబ్వేతో అయిదు టీ20ల సీరీస్ ఆడుతోంది. ఇప్పటికి రెండు మ్యాచ్‌లు జరిగాయి. మొదటి మ్యాచ్ జింబాబ్వే గెలిస్తే రెండో మ్యాచ్‌లో భారత కుర్రాళ్ళు ఘన విజయం సాధించారు.

రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమ్ ఇండియా. 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు లతో సెంచరీ చేయగా.. రుతురాజ్‌ గైక్వాడ్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌ 77 పరుగులు చేసి అర్ధ శతకంతో మెరిశాడు. అయితే కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ మాత్రం రెండు పరుగులకే అవుట్ అయ్యాడు. తరువాత వచ్చి బ్యాటర్లు ఇద్దరూ నెమ్మదిగా ఆడారు. దీంతో భారత స్కోరు 180 కూడా దాటడం కష్టమే అనిపించింది. కానీ అభిషేక్ వర్మ హాఫ్ సెంచరీ తర్వాత వేగంగా ఆడేసరికి స్కోరు కూడా పరుగులు పెట్టింది. డియోన్ మేయర్స్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4, 6, 4 బాదేశాడు. రజా వేసిన 13 ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు రాబట్టాడు అభిషేక్. తరువాత మసకద్జ వేసిన ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి అభిషేక్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివర్లో రింకూ సింగ్ కూడా 22 బంతుల్లో 48 పరుగులు చేసి సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు.

మరోవైపు భారత్ ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించలేక జింబాబ్వే ఆటగాళ్ళు చతికిల పడ్డారు. భారత బౌలర్ల ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ మద్వీర 43 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్రియాన్‌ బెనెట్ 9 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 26 పరుగులు చేసి దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. జాంగ్వి (33), జోనాథన్ క్యాంప్‌బెల్ (10) పరుగులు చేశారు. ఇన్నోసెంట్ కైయా (4), సికిందర్ రజా (4) సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. క్లైవ్ మండాడే (0), డియోన్ మేయర్స్ (0) పరుగుల ఖాతా తెరవలేదు. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ (3/15), రవి బిష్ణోయ్ (2/11), ముకేశ్ కుమార్ (3/37) జింబాబ్వేను కట్టడి చేశారు. వాషింగ్టన్ సుందర్‌ ఒక వికెట్ పడగొట్టాడు.

Also Read:Telangana: 6 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి- రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
తాజా కథనాలు