/rtv/media/media_files/2026/02/27/aravind-2026-02-27-18-04-50.jpg)
Arvind Kejriwal
Arvind Kejriwal : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు ఈ రోజు (బుధవారం) నాడు ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. నిజానికి ఈ కేసులో ఇప్పటికే రౌస్ ఎవెన్యూ కోర్టు నిర్దోషిగా ప్రకటించినప్పటికీ దీన్ని ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ హైకోర్టులో సవాలు చేసింది. దీంతో కోర్టు ఆయనకు మరోసారి నోటీసులు పంపింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో గతంలో ఈడీ సమన్లు జారీ చేసినప్పటికీ కేజ్రీవాల్ హాజరుకాలేదు. దీంతో ఈడీ రెండు వేర్వేరు కేసులు నమోదు చేసింది.ఈ కేసుల్లో ఆయనను రౌస్ ఎవెన్యూ కోర్టు ఇటీవల నిర్దోషిగా ప్రకటించింది. అయినప్పటికీ దీన్ని సవాల్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కేజ్రీవాల్కు తాజాగా మరోసారి నోటీసులు పంపింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది.
హైకోర్టులో ఈడీ వేసిన పిటిషన్పై జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్కు ముందుగానే నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన ఉద్దేశపూర్వకంగానే విచారణకు హాజరుకాలేదని ఈడీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. కేజ్రీవాల్ను నిర్దోషిగా ప్రకటించి ట్రయల్ కోర్టు పొరపాటు చేసిందని ఆయన వాదించారు. ఈడీ వాదనలు విన్న ధర్మాసనం కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అనంతరం ఈనెల 29వ తేదీకి కేసును వాయిదా వేసింది.
కాగా, మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్పై విచారణకు తగిన ఆధారాలు లేవంటూ ఫిబ్రవరి 27న విచారణ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్తో పాటు సిసోడియా, కల్వకుంట్ల కవిత, మరో 20 మందిని లిక్కర్ పాలసీ కేసులో నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ కూడా ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉండగా, ఈడీ సైతం హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.
Follow Us