MUDA Scam: ముడా స్కామ్‌ వివాదం.. సీబీఐకి షాక్‌ ఇచ్చిన సిద్ధరామయ్య

ప్రస్తుతం కర్ణాటకలో ముడా స్కామ్‌ అంశం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి సంబంధించిన కేసుల్లో సీబీఐ విచారించకుండా 'జనరల్‌/ఓపెన్ కన్‌సెంట్‌'ను ఉపసంహరించుకుంది.

New Update
MUDA

ప్రస్తుతం కర్ణాటకలో ముడా స్కామ్‌ అంశం సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు మరికొంతమందిపై విచారణ చేయాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. మూడు నెలల్లోగా దీనిపై నివేదిక అందించాలని లోకయుక్త పోలీసులను ఆదేశించింది. మరోవైపు ఈ స్కామ్‌పై సీబీఐ విచారణ చేయాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి సంబంధించిన కేసుల్లో సీబీఐ విచారించకుండా 'జనరల్‌/ఓపెన్ కన్‌సెంట్‌'ను ఉపసంహరించుకుంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (DSPE)యాక్ట్‌,1946 లోని సెక్షన్‌ 6 ప్రకారం..  ఏదైనా రాష్ట్రం ఓపెన్‌ కన్‌సెంట్‌ను ఉపసంహరించుకుంటే సీబీఐ విచారణ చేసేందుకు కచ్చితంగా ఆ రాష్ట్రం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.  

Also Read: వాతావరణ పరిస్థితులను పక్కాగా అంచనా వేసే సూపర్‌ కంప్యూటర్లు..

ఈ వ్యవహారంపై కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పటెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. '' రాష్ట్రంలో సీబీఐ విచారణకు సంబంధించి మేము ఓపెన్‌ కన్‌సెంట్‌ను ఉపసంహరింకుంటున్నాం. సీబీఐని దుర్వినియోగం చేస్తారని మేము భావిస్తున్నాం. దాదాపు అన్ని కేసుల్లో మేము సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చాం. కానీ వాళ్లు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయలేదు. చాలా కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మేము పంపించిన కొన్ని కేసుల్లో విచారణ చేసేందుకు సీబీఐ నిరాకరించింది. వాళ్లు ఏకపక్షంగా ఉంటారు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. కేవలం ముడా కేసు కోసమే ఇలా చేయలేదు. సీబీఐ తప్పుదోవలో నడవకుండా నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని'' హెచ్‌కే పటేల్‌ అన్నారు.    

Advertisment