JEE Advanced-2026 : JEE అభ్యర్థులకు గుడ్ న్యూస్ .. రేపే అడ్వాన్స్‌డ్ ఫలితాలు

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ల్లో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced-2026) పరీక్ష ఫలితాల తేదీ ఖరారైంది. రేపు (జూన్ 1, సోమవారం) ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి.

New Update
JEE Advanced Results out

JEE Advanced Results

JEE Advanced-2026 : దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ల్లో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced-2026) పరీక్ష ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఈ అత్యున్నత ప్రవేశ పరీక్ష రాసి, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు పరీక్షను నిర్వహించిన ఐఐటీ రూర్కీ (IIT Roorkee) బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. రేపు (జూన్ 1, సోమవారం) ఉదయం 10 గంటలకు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు తమ ఆలిండియా ర్యాంకులను (AIR), స్కోర్ కార్డులను తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుంది.

ఫలితాలను చూసుకునే విధానం

అభ్యర్థులు మొదటగా ఐఐటీ రూర్కీ అధికారిక వెబ్‌సైట్ https://jeeadv.ac.in/ ను సందర్శించాలి.
హోమ్‌పేజీలో అందుబాటులో ఉండే 'JEE Advanced 2026 Results' లింక్‌పై క్లిక్ చేయాలి.
అక్కడ అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
వివరాలు సబ్మిట్ చేయగానే స్క్రీన్‌పై మీ స్కోర్ కార్డ్ ప్రత్యక్షమవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోవచ్చు.

1.80 లక్షల మంది అభ్యర్థుల నిరీక్షణ

ఈ ఏడాది మే 17న దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లోని పరీక్షా కేంద్రాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 1.80 లక్షల మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ కఠినమైన ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఐఐటీల్లో సీటు సాధించడమే లక్ష్యంగా శ్రమించిన ఈ విద్యార్థులందరి సుదీర్ఘ నిరీక్షణకు రేపటితో తెరపడనుంది.

తగ్గనున్న కటాఫ్ మార్కులు?

ఇదిలా ఉంటే, ఈ ఏడాది జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షా సరళిపై సబ్జెక్ట్ నిపుణులు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు. గత కొన్ని ఏళ్లతో పోలిస్తే ఈసారి ప్రశ్నపత్రం కొంత కఠినంగా (Tough) వచ్చిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగా, ఈసారి ఐఐటీ సీట్ల భర్తీకి సంబంధించిన కటాఫ్ మార్కులు (Cut-off Marks) గతం కంటే తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ నిపుణుల అంచనాలే నిజమైతే.. ఈసారి తక్కువ స్కోర్ వచ్చినప్పటికీ విద్యార్థులకు మెరుగైన ఆలిండియా ర్యాంకు లభించే అవకాశం ఉంది. ఫలితాల అనంతరం దేశంలోని వివిధ ఐఐటీల్లో సీట్ల భర్తీ ప్రక్రియ (JoSAA కౌన్సెలింగ్) ప్రారంభం కానుంది.

Advertisment
తాజా కథనాలు