ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచేందుకు ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. దీంతో దేశ రాజధాని ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఏ పార్టీకి ఢిల్లీ ప్రజలు అధికార పీఠం అప్పగిస్తారనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు స్థానిక సంస్థలు నిర్వహించిన ప్రీ పోల్ సర్వేల అంచనాలు బయటపడుతున్నాయి. ఫలోడి సత్తా బజార్ అనే స్థానిక సర్వే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై అంచనాలు వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీయే ఎన్నికల రేసులో ముందున్నప్పటికీ.. 2015, 2020లో వచ్చిన సీట్ల కంటే తక్కువ వస్తాయని వెల్లడించింది.
పెరగనున్న బీజేపీ బలం
ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి ఎన్నికల్లో 38 నుంచి 40 సీట్లు వస్తాయని చెప్పింది. ఇంతకు ముందు 37-39 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. పోలింగ్కు ముందు సీట్ల సంఖ్య కాస్త పెరిగినట్లు పేర్కొంది. ఇక బీజేపీకి ఇంతకు ముందు 31-33 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. ఇప్పుడు 30 నుంచి32 సీట్లు వస్తాయని తెలిపింది. 2015, 2020 ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ బలమైన ప్రత్యర్థి పార్టీగా మారినట్లు పేర్కొంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాదని ఫలోడి సత్తా బజార్ అంచనా వేసింది. ఇంతకుముందు 0-1 సీటు వస్తుందని చెప్పగా.. పోలింగ్కు ముందు ఒక్క సీటు కూడా రాదని తేల్చిచెప్పింది. మొత్తానికి ఫలోడి సత్తా బజార్ సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి విజయం సాధిస్తుందని అంచనా వేసింది. కానీ కొన్ని సవాళ్లు ఎదురుకావడం వల్ల పార్టీకి సీట్ల సంఖ్య తగ్గుతుందని పేర్కొంది.
Also Read: కేజ్రీవాల్ విలవిల.. ట్యాక్స్ మినహాయింపు వెనుక మోదీ వ్యూహం ఇదే!
ఆప్కు 50-55 సీట్లు
ఇక మరో స్థానిక ఎన్నికల సంస్థ వీప్రిసైడ్ కూడా ఢిల్లీ ఎన్నికలపై సర్వే చేసింది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీకి 50-55 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే బీజేపీకి 15 -20 సీట్లు వస్తాయని చెప్పగా.. కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా గెలవదని పేర్కొంది. మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని విప్రిసైడ్ సర్వేలో తేలింది.
దళితుల ఓట్లు ఆప్కే
మరోవైపు ఇటీవల 'నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్' (NACDAOR) అలాగే 'ది కన్వర్జెంట్ మీడియా' సంయుక్తంగా జరిపిన సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఢిల్లీలో దళిత ఓట్లు ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీకే రానున్నాయని ఈ సర్వే వెల్లడించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జనవరి 1 నుంచి జనవరి 15 వరకు ఈ రెండు సంస్థలు ఢిల్లీలో 6,256 మంది దళితులపై ఎన్నికల సర్వే నిర్వహించాయి. ఇందులో 2,574 మంది మహిళలు కూడా ఉన్నారు. అయితే ఈ సర్వేలో 44 శాతం మంది దళితులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేస్తామని చెప్పారు. 32 శాతం మంది బీజేపీకి, 21 శాతం మంది కాంగ్రెస్కు ఓటేస్తామని తెలిపారు. ఆప్కు 35 స్థానాల్లో దళితుల మెజార్టీ ఓట్లు ఆప్కు పడనున్నాయి.
Also Read: మీ సాలరీ ఎంత? కట్టాల్సిన ట్యాక్స్ ఎంత?.. సింపుల్ గా తెలుసుకోండిలా..!
ఇక బీజేపీకి 28 స్థానాల్లో, కాంగ్రెస్కు 7 స్థానాల్లో దళితుల మెజార్టీ ఓట్లు పడనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 12 ఎస్సీ రిజర్వుడ్ సీట్లు ఉండటం మరో విశేషం. మొత్తంగా దీన్ని బట్టి చూస్తే ఇతర సామాజిక వర్గాల ఓట్లు కూడా కేజ్రీవాల్కే పడనున్నాయని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి ఆప్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
ఇదిలాఉండగా.. ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో జరగనున్న ఈ ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలోకి రావాలంటే కనీసం 35 సీట్లు రావాలి. అయితే ఎన్నికలకు ముందు పలు స్థానిక సంస్థలు జరిపిన ప్రీ పోల్ సర్వేల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేయడం ఆసక్తికరంగా మారింది. ఇక పోలింగ్ రోజున ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. మరీ ఈసారి ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 8 వరకు వేచి చూడాల్సిందే.