/rtv/media/media_files/2026/05/22/summer-2026-05-22-16-09-36.jpg)
Do you know what happens when you suddenly get out of the AC?
Summer Tips: ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న మునుపెన్నడూ లేని భీకరమైన వడగాలులు, ఎండల తీవ్రతకు ఎయిర్ కండిషనర్ (AC) అనేది విలాస వస్తువు నుండి ప్రతి ఒక్కరి అవసరంగా మారిపోయింది. ఇళ్లు, ఆఫీసులు, ప్రయాణాలు.. ఇలా ఎక్కడ చూసినా ప్రజలు గంటల తరబడి ఏసీల్లోనే గడుపుతున్నారు. అయితే, సుదీర్ఘ సమయం పాటు ఏసీ గదుల్లో గడిపిన తర్వాత అకస్మాత్తుగా తీవ్రమైన ఎండలోకి, వేడి గాలుల్లోకి రావడం శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది గొంతు నొప్పి, పొడి దగ్గు, తలనొప్పి, అలసట , కళ్లు తిరగడం వంటి సమస్యలతో బాధపడటానికి ప్రధాన కారణం ఇదేనని వైద్యులు చెబుతున్నారు.
అపోలో క్లినిక్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ నిలేష్ సోనవణే నివేదిక ప్రకారం.. చాలా మంది ఈ లక్షణాలను సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ లేదా సమ్మర్ కోల్డ్ (వేసవి జలుబు) అని పొరబడుతుంటారు. కానీ నిజానికి ఏసీ వల్ల గదిలోని గాలి నాణ్యత మారడం, తేమ శాతం తగ్గిపోవడమే దీనికి అసలు కారణం. ఎయిర్ కండిషనర్ గదిలోని వేడితో పాటు తేమను కూడా పూర్తిగా పీల్చేస్తుంది. దీనివల్ల గదిలోని గాలి పొడిగా (Dry) మారుతుంది. ఈ పొడి గాలి నేరుగా మన గొంతు, శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గంటల తరబడి ఆఫీసుల్లో ఏసీ కింద కూర్చుని, మధ్యాహ్నం పూట ఒక్కసారిగా బయట ఉన్న తీవ్రమైన ఎండలోకి రావడం వల్ల శరీరం అకస్మాత్తుగా ఆ ఉష్ణోగ్రత మార్పును తట్టుకోలేక షాక్కు గురవుతుంది.
అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు మారినప్పుడు (ఉదాహరణకు ఏసీలో 20 డిగ్రీల నుండి బయట 44 డిగ్రీల ఎండలోకి రావడం) మన శరీరం ఆ వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపే శరీరం తీవ్రమైన డీహైడ్రేషన్ (నిర్జలీకరణం), తలనొప్పి, నీరసం, కళ్లు తిరగడం మరియు 'హీట్ ఎగ్జాస్టన్' (తీవ్రమైన వేడి వల్ల వచ్చే అలసట) బారిన పడుతుంది. ముఖ్యంగా ఆస్తమా, అలర్జీలు లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. అందువల్ల ఏసీ రూమ్ నుండి బయటకు రాగానే నేరుగా ఎండలోకి వెళ్లకుండా, కొన్ని నిమిషాల పాటు సాధారణ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశంలో (నార్మల్ రూమ్ లేదా వరండా) ఆగి, శరీరం బయటి వాతావరణానికి సర్దుబాటు అయ్యాకనే ఎండలోకి వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఏసీ గదుల్లో ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరం, చర్మం రెండు కూడా పొడిబారిపోతాయి. ఏసీలో ఉన్నప్పుడు దాహం వేయకపోవడంతో చాలా మంది నీళ్లు తాగడం నిర్లక్ష్యం చేస్తారు. కానీ, అలా ఏసీ నుండి బయటకు రాగానే శరీరంలో ఒక్కసారిగా నీటి కొరత ఏర్పడుతుంది. అందుకే దాహం వేసినా, వేయకపోయినా రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగుతూనే ఉండాలి. కేవలం మంచి నీళ్లే కాకుండా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ ,తాజా పండ్ల రసాలు తీసుకోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. ఇది వేసవిలో వచ్చే నీరసాన్ని (Summer Fatigue) దూరం చేస్తుంది.
ఎండల తీవ్రత నుండి రక్షణ పొందడానికి వాతావరణానికి అనుకూలమైన దుస్తులను ధరించడం చాలా ముఖ్యం. వేసవిలో లేత రంగుల్లో ఉండే వదులైన కాటన్ (నూలు) దుస్తులను ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు, టోపీ లేదా స్కార్ఫ్ ఉపయోగించాలి. వీటన్నింటితో పాటు, తీవ్రమైన ఎండ నుండి ఇళ్లకు లేదా ఆఫీసులకు రాగానే ఫ్రిజ్లోని అతి చల్లని నీటిని లేదా ఐస్ డ్రింక్స్ను అస్సలు తాగకూడదు. ఇలా చేయడం వల్ల గొంతు మంట, గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక కాసేపు విశ్రాంతి తీసుకుని, శరీరం సాధారణ స్థితికి వచ్చాకే కుండ నీరు లేదా మామూలు నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
Follow Us