/rtv/media/media_files/2026/05/13/trump-2026-05-13-15-26-12.jpg)
US offers $15 million reward for information on IRGC's financial mechanisms
అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని మరింత ముదిరేలా చేస్తున్నాయి. ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వట్లేదు. ముఖ్యంగా అమెరికా ప్రతిపాదించిన షరతులను ఇరాన్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఒప్పందం కుదిరే ప్రక్రియ ఆలస్యమవుతూనే ఉంది. ఈ ప్రతిష్టంభనను తొలగించడం కోసం అమెరికా విదేశాంగ శాఖ మరో వ్యూహాత్మక అడుగు వేసింది. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా ఓ భారీ రివార్డును ప్రకటించింది.
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (IRGC)కి ఆర్థికంగా అండగా ఉంటున్న బినామీ కంపెనీలు, వ్యక్తులు లేదా సంస్థల సమాచారాన్ని ఇచ్చిన వాళ్లకి రూ.145 కోట్ల (దాదాపు 15 మిలియన్ డాలర్లు) వరకు నజరానా ఇస్తామని ఆఫర్ చేసింది. గల్ఫ్ దేశాలపై దాడులు అడ్డుకోవడం, అణు కార్యక్రమాలను నిలిపివేయడం కోసం ఇరాన్ను ఆర్థికంగా బలహీనపరచడమే తమ టార్గెట్ అని అమెరికా తేల్చిచెప్పింది.
Also Read: అమెరికా ముందు పాక్ ను అడ్డంగా ఇరికించిన చైనా.. భలే దెబ్బ కొట్టిందిగా!
మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ అమెరికా తీసుకున్న ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాకు తమ ప్రతిపాదనలను అంగీకరించడం తప్ప మరో మార్గం లేదన్నారు. తమపై మళ్లీ ఎలాంటి దాడులు చేసినా తమ సాయుధ దళాలు గట్టిగా సమాధానమిస్తాయని హెచ్చరించారు. తప్పుడు వ్యూహాలు ఎప్పుడూకూడా తప్పుడు ఫలితాలనే ఇస్తాయన్నారు. అమెరికా ఒత్తిడికి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఇరు దేశాల మధ్య చర్చల విషయంలో తమ నిబంధనలకే కట్టుబడి ఉంటామని ఇరాన్ స్పష్టం చేసింది.
అయితే ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని తాము ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నా కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అమెరికా నిఘా వర్గాలే ఈ విషయాన్ని వెల్లడించాయి. హర్మూజ్ జలసంధికి దగ్గర్లో 30 కీలక స్థావరాల్లో ఇరాన్ తిరిగి తమ అణు కార్యాచరణను ప్రారంభించినట్లు నిఘా నివేదికలు తెలిపాయి. అలాగే ఇరాన్లోని దాదాపు 90 శాతం భూగర్భ క్షిపణి సౌకర్యాలు మళ్లీ వాడుకలోకి వచ్చినట్లు ఆధారాలు లభించడంతో అమెరికా ఆందోళన చెందుతోంది. దీంతో ఈ పరిణామాలు పశ్చిమాసియాలో మరిన్ని ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Follow Us