/rtv/media/media_files/2026/05/02/us-2026-05-02-16-12-40.jpg)
US approves arms sales of over $8.6 billion for Israel, Qatar, Kuwait and UAE
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అమెరికాకు ఒక వ్యూహాత్మక, ఆర్థిక వరంగా మారిపోయాయి. అమెరికా ఇరాన్పై జరిపిన దాడులు కేవలం సైనిక చర్యలకే కాక తెరవెనుక భారీ ఆర్థిక ప్రయోజనాలను సైతం తీసుకొచ్చాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో సాగిన ఈ యుద్ధం అమెరికా ఆయుధ విక్రయాలకు కొత్త మార్గాలను తెరిచాయి. ఈ యుద్ధం సృష్టించిన భయానక వాతావరణాన్ని సాకుగా చూపిస్తూ.. అమెరికా తమ మిత్రదేశాలకు బిలియన్ల డాలర్ల విలువైన యుద్ధ సామాగ్రిని విక్రయించింది. తద్వారా తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంది.
మే 1, 2026న విడుదలైన తాజా రిపోర్టుల ప్రకారం.. అమెరికా విదేశాంగ శాఖ తమ మిడిల్ ఈస్ట్ మిత్రదేశాలకు ఏకంగా 8.6 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల విక్రయించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇరాన్తో ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉంది. కానీ పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితిని మాత్రం అమెరికా సమర్థవంతంగా వాడుకుంటోంది. ఇజ్రాయెల్, ఖతార్, కువైట్, యూఏఈ దేశాలకు అత్యాధునిక రక్షణ వ్యవస్థలను సరఫరా చేయనుంది. ఒకవైపు ప్రధాన శత్రువు ఇరాన్ను బలహీనపరచడం, మరోవైపు మిత్రదేశాల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని నగదుగా మార్చుకోవడం అనేది అమెరికా వ్యూహాత్మక చర్యగా మారింది.
Also Read: మేము అలా చేయకుంటే ఇజ్రాయెల్, పశ్చిమాసియా, యూరప్ ముక్కలయ్యేవి.. ట్రంప్ కీలక ప్రకటన
ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా తమ మిత్ర దేశాల్లో ఒక్కో దేశానికి వాళ్ల అవసరాలకు తగ్గట్లుగా ఆయుధాలను కేటాయించనున్నారు. ఖతార్ సుమారు 4.01 బిలియన్ డాలర్లతో 'పేట్రియాట్' క్షిపణి రక్షణ వ్యవస్థలను, 992 మిలియన్ డాలర్ల రాకెట్లను కొనుగోలు చేయనుంది. కువైట్కు 2.5 బిలియన్ డాలర్ల విలువైన సమీకృత యుద్ధ కమాండ్ వ్యవస్థను అమెరికా అందించనుంది. ఇజ్రాయెల్ 992 మిలియన్ డాలర్ల విలువైన అధునాతన ఖచ్చితత్వ ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ఇక యూఏఈకి 47.6 మిలియన్ డాలర్ల విలువైన గైడెడ్ రాకెట్లను అమెరికా విక్రయించింది. ఈ ఆయుధాలన్నీ కూడా ప్రధానంగా ఆకాశంలో వచ్చే శత్రు దాడులను అడ్డుకోవడానికి, కచ్చితమైన దాడులు చేయడానికి ఉపయోగపడనున్నాయి.
2026 ఫిబ్రవరి-మార్చి మధ్య జరిగిన యుద్ధంలో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల వల్ల గల్ఫ్ దేశాలు అతలాకుతలమయ్యాయి. దీంతో అక్కడి వాయు రక్షణ వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో తేలిపోయింది. అందుకే తమను తాము రక్షించుకునేందుకు ఈ దేశాలు విపరీతంగా క్షిపణులను వాడటంతో వాటి ఆయుధ నిల్వలు తగ్గిపోయాయి. అందుకే తదుపరి ముప్పును ఎదుర్కొనేందుకు ఈ దేశాలు అమెరికా వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని అవకాశంగా మార్చుకున్న అమెరికా.. తమ ఆయుధ మార్కెట్ను విస్తరించుకుంది.
Also Read: అమెరికాతో మళ్లీ యుద్ధం.. ఇరాన్ సంచలన ప్రకటన
ఈ పరిణామాలు అమెరికా ఆర్థిక ప్రయోజనాలకే వరంగా మారుతున్నాయి. ఓవైపు తమ మిత్రదేశాలకు అండగా ఉంటామని భరోసా ఇస్తూనే.. మరోవైపు ఇరాన్ వల్ల ఉండే ముప్పును సాకుగా చూపించి ఆయుధ వ్యాపారం చేస్తోంది. అందుకే ఈ 8.6 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కేవలం రక్షణ సహకారంగా మాత్రమే కాక యుద్ధం వల్ల సృష్టించిన ఓ వ్యూహాత్మక- ఆర్థిక ఎత్తుగడ అని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ బలహీనపడటం వల్ల అమెరికా ఖజానా పెరుగుతుండటం ఈ యుద్ధం సాధించిన అసలు లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు.
Follow Us