/rtv/media/media_files/2026/05/17/ukrainian-drone-attacks-on-russia-kill-at-least-five-2026-05-17-19-12-18.jpg)
Ukrainian drone attacks on Russia kill at least five
రష్యా రాజధాని మాస్కోతో పాటు పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ ఎత్తున డ్రోన్ దాడులకు పాల్పడింది. ఏడాది కాలంలో రష్యాపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని రక్షణ అధికారులు వెల్లడించారు. ఆదివారం రష్యా అధికారిక వర్గాలు తెలిపిన ప్రకారం.. ఈ దాడుల వల్ల నలుగురు మృతి చెందారు. మాస్కో ఉత్తర ప్రాంతమైన ఖిమ్కిలో ఓ ఇంటిపై డ్రోన్ పడింది. దీంతో అందులో ఉన్న ఓ మహిళ మరణించింది. మైటిష్చి జిల్లాలో పొగొరెల్కి గ్రామంలో మరో ఇద్దరు మృతి చెందారు. అలాగే ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని బెల్గొరోడ్లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడుల వల్ల పలు అపార్ట్మెంట్లు, కీలక మౌలిక సదుపాయాల కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు మాస్కో గవర్నర్ ఆండ్రే వోరోబ్యోవ్ తెలిపారు.
Also Read: ఎబోలా వైరస్ సోకి 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO
రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ 'టాస్' తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు ఉక్రెయిన్కు చెందిన 556 డ్రోన్లను అడ్డుకుని కూల్చివేశాయి. ఇందులో కేవలం రాజధాని మాస్కోను టార్గెట్ చేసుకుని వచ్చిన 81 డ్రోన్లు ఉన్నట్లు నగర మేయర్ సెర్గెయ్ సోబ్యానిన్ వెల్లడించారు. మాస్కోలో ప్రముఖ చమురు శుద్ధి కేంద్రం సమీపంలో డ్రోన్ శకలాలు పడటం వల్ల కొందరు గాయపడ్డారు. కానీ ప్లాంట్ కార్యకలాపాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అలాగే అత్యంత రద్దీగా ఉండే షెరెమెత్యేవో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పరిధిలో డ్రోన్ శిథిలాలు పడ్డా కూడా ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Also Read: హర్మూజ్ దాటి భారత్కు చేరిన మరో LPG నౌక..
మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరూ కూడా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ముగింపు దశకు వచ్చే ఛాన్స్ ఉందని సంకేతాలు ఇచ్చిన తరుణంలోనే ఈ భారీ దాడులు జరగడం కలకలం రేపుతోంది. ఇరు దేశాలు త్వరలో శాంతి ఒప్పందానికి వస్తాయని ఆశిస్తున్నామని గత వారం ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఉక్రెయిన్లో పలు ప్రాంతాలపై రష్యా తన ప్రతీకార దాడులను చేస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఖార్కివ్ పరిధిలోని 15 ప్రాంతాలపై రష్యా బలగాలు దాడులు జరిపాయి. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు.
Follow Us