/rtv/media/media_files/2025/03/19/ObflooHD9sFpSANnqYVY.jpg)
Sunita Williams
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తొమ్మిది నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమిపైకి సురక్షితంగా చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం ఆందోళన నెలకొంది. తొమ్మిది నెలలుగా వారు అంతరిక్షంలో గడపడం వల్ల భూమిపై వెంటనే నడవలేని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం సునీతా విలియమ్స్కు 59 ఏళ్లు. ఇప్పటికే ఆమె ఐదుసార్లు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. వయసు రీత్యా చూసుకుంటే మానసిక, శారీరక ఒత్తిడి ఉంటుంది.
నడిచేవరకు వైద్యుల పర్యవేక్షణలోనే
ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండటం వల్ల బుచ్ విల్మోర్ కంటే సునీతా విలియమ్స్ మానసికంగా, శారీరంగా చాలా ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. స్పేస్లో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి వ్యోమగాములు గాల్లోనే తేలుతుంటారు. భూమిపైకి వచ్చాక సాధారణ పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్లకి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా కొన్ని నెలల పాటు ఎక్సర్సైజ్లు చేయాల్సి ఉంటుంది. వాళ్లు సొంతంగా నడిచేవరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారు.
Also Read: ఈసీ ప్రతిపాదనతో మా వాదనకు మద్దతు..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
శరీరంలో మార్పులు
అంతరిక్షంలో తక్కువ గురుత్వాకర్షణ వాతావరణంలో జీవించడం వల్ల కండరాల క్షీణత, ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఆస్ట్రోనాట్స్ భూమిపై ఉన్నప్పుడులా కండరాలు కదిలించలేరు. కాబట్టి, కాలక్రమేణా వారి బలం తగ్గుతుంది. అంతరిక్షంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ, వారు బలహీనంగానే ఉంటారు. మళ్లీ పూర్తి బలాన్ని తిరిగి పొందడానికి కొంత టైం పడుతుంది. రక్త ప్రసరణలో కూడా మార్పులు వస్తాయి. ఎముకల కదలికల్లో నొప్పి ఉండొచ్చు. కంటి చూపుతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. అందుకే సునీతా విలిమమ్స్, బుచ్ విల్మోర్కు మళ్లీ సాధారణ పరిస్థికి వచ్చి, నడిచేవరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారు.
ఇదిలాఉండగా.. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భారత కాలమాన ప్రకారం బుధవారం వేకుమజామున సుమారు 3.27 AM గంటలకు ఫ్లొరిడా తీరానికి దగ్గర్లో ఉన్న అట్లాంటిక్ సముద్రంలో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా తిరిగివచ్చారు. ఎలాంటి టెక్నికల్ సమస్యలు తలెత్తకపోవడంతో వాళ్ల ల్యాండింగ్ సురక్షితంగా అనుకున్న సమయానికే అయ్యింది.
Also Read: టెస్లా కార్లు తగలబెట్టడం ఉగ్రవాద చర్యే: మస్క్!
గత ఏడాది జూన్లో సునీతా విలియమ్స్, బుచ్విల్మోర్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే వారు వెళ్లిన వ్యోమనౌక స్టార్లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్లో లీకులు ఏర్పడ్డాయి. థ్రస్టర్స్ మూసుకుపోయి హీలియం అయిపోయింది. దీంతో వ్యోమగాములను ఈ స్పేస్క్రాఫ్ట్లో తిరిగి భూమి పైకి తీసుకురావడం సేఫ్ కాదని నాసా నిర్ణయించింది. దీంతో వ్యోమగాములు లేకుండానే బోయింగ్ స్టార్లైనర్ 2024, సెప్టెంబర్ 7న భూమిపైకి వచ్చింది. ఇక సునీతా, విల్మోర్ను భూమిపైకి తెచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ కలిసి క్రూ 10 మిషన్ను చేపట్టాయి. చివరికి శనివారం నలుగురు ఆస్ట్రోనాట్లతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నారు.