/rtv/media/media_files/2026/06/16/modi-2026-06-16-19-16-48.jpg)
ఫ్రాన్స్లోని ఎవియాన్ నగరంలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సులో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకుంటూ ఆత్మీయంగా హ్యాండ్షేక్ చేసుకున్నారు. గత 16 నెలల కాలంలో ఇరు నేతలు ముఖాముఖిగా కలుసుకోవడం ఇదే మొదటిసారి.
VIDEO | Evian, France: Prime Minister Narendra Modi meets US President Donald Trump on the sidelines of G7 Summit in Nice.
— Press Trust of India (@PTI_News) June 16, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/Yo6vlSXYhz
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు హాజరయ్యారు. సదస్సు వేదిక వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ, ట్రంప్ను నవ్వుతూ పలకరించి చేతులు కలిపారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు మిగతా ప్రపంచ నాయకులతో కలిసి తమ సీట్లలో కూర్చున్నారు. అయితే, గతంలో వీరిద్దరి భేటీల్లో కనిపించే మోదీ మార్క్ హగ్ మాత్రం ఈసారి కనిపించలేదు.
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. 2025 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ వాషింగ్టన్ పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత వీరిద్దరూ నేరుగా కలుసుకోవడం ఇదే తొలిసారి. ఇటీవల భారత్-అమెరికా సంబంధాల మధ్య ఆపరేషన్ సింధూర్ పరిణామాలు, భారతీయ వస్తువులపై అమెరికా విధిస్తున్న సుంకాల వల్ల కొంత ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం గమనార్హం. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఎవియాన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఇది వరుసగా 7వ జీ7 సదస్సు కావడం విశేషం. ప్రపంచ వేదికలపై భారతదేశానికి పెరుగుతున్న ప్రాధాన్యతను ఇది స్పష్టం చేస్తోంది.
విడివిడిగా సమావేశం
జీ7 సదస్సు పక్కన పెడితే, ప్రధాని మోదీ షెడ్యూల్ పలు దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలతో చాలా బిజీగా సాగుతోంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో ఆయన విడివిడిగా సమావేశం కానున్నారు. ఈ చర్చల్లో ఆయా దేశాలతో సంబంధాల బలోపేతం, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై దృష్టి సారించనున్నారు. అనంతరం రాత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇచ్చే అధికారిక విందుకు ప్రధాని హాజరవుతారు.
ప్రపంచ ఆర్థిక స్థిరత్వం, ఇంధన భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాల వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తున్నారు. భారత్ జీ7లో అధికారిక సభ్యదేశం కాకపోయినప్పటికీ, ఈ వేదిక ద్వారా గ్లోబల్ సౌత్ సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడానికి న్యూఢిల్లీ ప్రయత్నిస్తోంది.
Follow Us