/rtv/media/media_files/2026/04/30/fotojet-2026-04-30-12-18-53.jpg)
Kohinoor Demand on screen.. Give it to India... Mamdani's sensational statement
Kohinoor Demand : ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'కోహినూర్' వజ్రాన్ని తిరిగి భారతదేశానికి అప్పగించాలనే డిమాండ్ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తెరపైకి వచ్చింది. న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మామ్దానీ, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ IIIకు ఈ మేరకు విజ్ఞప్తి చేయనున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. 9/11 స్మారక చిహ్నం వద్ద రాజును కలిసే ముందు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు, దశాబ్దాల నాటి ఈ చారిత్రక వివాదాన్ని ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ చర్చనీయాంశంగా మార్చాయి.
కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లాలతో మేయర్ మామ్దానీ భేటీకి ముందు కోహినూర్ ప్రస్తావన అధికారిక అజెండాలో లేదు. అయినప్పటికీ, రాజుతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా వజ్రాన్ని భారత్కు తిరిగి ఇచ్చేయాలని తాను గౌరవపూర్వకంగా కోరుతానని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. ఆ తర్వాత జరిగిన భేటీలో ఇరువురు చిరునవ్వులు చిందిస్తూ, కరచాలనం చేసుకున్నప్పటికీ, ఆ కొద్ది క్షణాల సంభాషణలో కోహినూర్ ప్రస్తావన వచ్చిందా లేదా అన్నది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.
కోహినూర్ వజ్రానికి వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. మొఘలులు, పర్షియన్లు, ఆఫ్ఘన్లు, సిక్కు పాలకుల చేతులు మారుతూ వచ్చిన ఈ అమూల్యమైన రత్నం.. 1849లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది. లాహోర్ ఒప్పందం ద్వారా అప్పటి యువ పాలకుడు మహారాజా దులీప్ సింగ్ నుంచి బ్రిటీషర్లు దీనిని బలవంతంగా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వజ్రం లండన్ టవర్లో బ్రిటీష్ క్రౌన్ జ్యువెల్స్ (రాజ కుటుంబపు ఆభరణాల)లో ప్రదర్శనలో ఉంది.
వలస పాలనలో అన్యాయంగా తరలించిన తమ వజ్రాన్ని వెంటనే వెనక్కి ఇచ్చేయాలని భారతదేశం పదేపదే డిమాండ్ చేస్తోంది. భారతీయుల దృష్టిలో కోహినూర్ అనేది చారిత్రక అన్యాయానికి సజీవ సాక్ష్యం. కానీ, 19వ శతాబ్దంలో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందం ద్వారా చట్టబద్ధంగానే తాము ఈ వజ్రాన్ని పొందామని, దానిపై పూర్తి హక్కులు తమవేనని బ్రిటన్ వాదిస్తూ వస్తోంది. భారతీయ మూలాలున్న మేయర్ మామ్దానీ తాజా వ్యాఖ్యలతో ఈ పాత వివాదం ఇప్పుడు మళ్లీ రాజుకుంది.
Follow Us