పాకిస్థాన్లో ఉగ్రవాదులు రైలును హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. బలూచిస్థాన్లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేశారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఇప్పటికే దీనికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. ఆ ట్రైన్లో దాదాపు 450 మంది ప్రయాణికులు తమ అదుపులో ఉన్నారని.. మిలటరీ ఆపరేషన్ చేసేందుకు యత్నిస్తే అందరినీ హతమారుస్తామని కూడా హెచ్చరించింది. అయితే బీఎల్ఏ పాకిస్థాన్లో గతంలో కూడా అనేక దాడులు చేసింది. అసలు ఈ బలిత్ లిబరేషన్ ఆర్మీ ఇలా ఎందుకు దాడులు చేస్తోంది. దీని డిమాండ్స్ ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
Also Read: చైనా సైంటిస్టుల అద్భుతం.. గుండెపోటు, స్ట్రోక్స్ రాకుండా వ్యాక్సిన్!
బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎలా ఏర్పడింది
1947లో భారత్కు స్వాతంత్ర్యం వచ్చాక పాకిస్థాన్ భారత్ను నుంచి వీడిపోయి మరో దేశంగా సంగతి తెలిసిందే. అప్పుడు పాకిస్థాన్లో బలోచిస్థాన్ స్వతంత్ర్య రాజ్యంగా ఉండేది. కానీ 1948లో పాకిస్థాన్ బలోచిస్థాన్ను బలవంతంగా స్వాధీనం చేసుకుంది. దీంతో అప్పటినుంచి బలోచిస్థాన్ ప్రజలు తమ రాజకీయ, సాంస్కృతిక గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నారు. 1970లో బలూచ్ ప్రజలు పాకిస్థాన్ నుంచి విడిపోయేందుకు చాలాసార్లు యత్నించారు. కానీ పాకిస్థాన్ సైనిక చర్య ప్రారంభించి బలూచ్ ప్రజల పోరాటాన్ని అణిచివేసింది. ఈ క్రమంలోనే పలు గ్రూపులు తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నాయి. అలా ఏర్పడిందే బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA).
ప్రత్యేక ప్రాంతం కావాలి
పాకిస్థాన్ నుంచి విడిపోయి బలూచిస్థాన్ ప్రత్యేక ప్రాంతంగా ఏర్పడాలని, తమకు స్వయం నిర్ణయాధికారం ఉండాలని బీఎల్ఏ డిమాండ్ చేస్తోంది. 2000 సంవత్సరంలో ఏర్పడిన ఈ వేర్పాటువాద సంస్థ పాకిస్థాన్ సైన్యంపై దాడులకు పాల్పడుతునే ఉంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్తో సహా అమెరికా, యూకే బీఎల్ఏను ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. ఈ బలూచిస్థాన్ ప్రాంతం అనేది నైరుతి పాకిస్థాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ అఫ్గానిస్థాన్లలో వ్యాపించి ఉంది.
చైనా కుట్ర ?
అయితే చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEK) ప్రాజెక్టును చేపట్టారు. ఇది బలూచిస్థాన్ మార్గం గుండా వెళ్తోంది. ఆర్థిక వృద్ధికి సిపెక్ దోహదపడుతుందని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు తమ ప్రాంత వనరులను కొల్లగొట్టేందుకు ఇదో ఎత్తగడ అని బలూచిస్థాన్ వాసులు వాదిస్తున్నారు. దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని చెబుతున్నారు. అందుకే ఈమధ్య కాలంలో సిపెక్కు చెందిన ప్రాజెక్టులు, సిబ్బందిపై, చైనీయులపై అక్కడ దాడులు పెరిగిపోయాయి.
Also Read: ఆయుధాల దిగుమతిలో భారత్ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో ఉక్రెయిన్ !
మరోవైపు బలూచ్ తిరుగుబాటును పాకిస్థాన్ అణిచివేస్తుండటంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఓ నివేదిక ప్రకారం 2011 నుంచి దాదాపు 10 వేల మంది బలూచ్ ప్రజలు అదృశ్యమయ్యారు. అయితే పాకిస్థాన్లో బలూచిస్థాన్ వేర్పాటువాదులు వరుసగా దాడులు చేస్తూనే ఉన్నారు. రైల్వేలైన్లు, పోలీస్ స్టేషన్లు, వాహనాలపై దాడులకు తెగబడుతున్నారు. బస్సులో నుంచి ప్రయాణికులను కిందకి దించి వాళ్ల గుర్తింపు కార్డులు చూసి మరి కాల్చిచంపిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే ఇప్పుడు తాజాగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. ట్రైన్ను హైజాక్ చేయడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఆరుగురు మిలటరీ సిబ్బంది కూడా మృతి చెందారని ఆ సంస్థ ప్రకటించింది. ఒకవేళ తమపై సైనిక చర్యలకు దిగితే ప్రయాణికులందరినీ చంపేస్తామని హెచ్చరించింది. మరోవైపు ఘటనాస్థలాకి పాక్ సహాయక, భద్రత బలగాలు చేరుకున్నట్లు తెలుస్తోంది. బందీలను విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.