ICMR: కత్తిగాటు లేకుండా శవపరీక్ష చేసే విధానం.. త్వరలో అందుబాటులోకి

సాధారణంగా శవపరీక్షలు పూర్తి కావడానికి కనీసం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. వర్చువల్ అటాప్సి విధానంలో ఎలాంటి కత్తిపోట్లు లేకుండానే అరగంటలో పూర్తవుతుంది. త్వరలోనే ఈ విధానం ఏపీకి అందుబాటులోకి రానుంది.

New Update
ICMR: కత్తిగాటు లేకుండా శవపరీక్ష చేసే విధానం.. త్వరలో అందుబాటులోకి

ICMR: ఏదైనా ప్రమాదాల్లో, క్రైమ్ ఘటనలో చనిపోయినవారిని సాధారణంగా శవపరీక్షలకు తరలిస్తుంటారు. కానీ ఇది కుటుంబ సభ్యులకు అంతులేని ఆవేదనను కలిగిస్తుంది. శవపరీక్షలో మృతుల శరీర భాగాలు కోయడం లాంటివి వారు జీర్ణించుకోలేరు. అందుకే కొంతమంది మెడికో లీగల్‌ కేసుల్లో కూడా శవపరీక్షలకు ముందుకు వచ్చేందుకు జంకుతుంటారు. రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే కత్తిగాట్లు అనేవే లేకుండా వర్చువల్‌ విధానంలో శవపరీక్ష చేసే సాంకేతికత త్వరలోనే ఏపీలో అందుబాటులోకి రాబోతుంది. ఎవరినైనా పోస్టుమార్టానికి తరలించినప్పుడు.. శవపరీక్షను వెంటనే పూర్తిచేసి పంపించడంతో పాటు వీటికి సంబంధించిన రిపోర్టులు కూడా న్యాయపరంగా చెల్లుబాటు అవుతాయి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం.. వర్చువల్ లేదా డిజిటల్ శవపరీక్ష విధానాన్ని రాష్ట్రాలు పాటించాలని మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు బోధనాసుత్రులకు అత్యాధునిక స్కానింగ్ యంత్రాలను గ్రాంట్స్‌ రూపంలో అందించనున్నారు. వీటికోసం దాదాపు రూ.2 కోట్లు ఖర్చవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గంటూరు, కర్నూలు బోధనాసుపత్రులు, విశాఖ కేజీహెచ్‌లో ఈ విధానాన్ని అమలుచేసేందుకు పనులు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, రిషికేశ్, నాగ్‌పూర్ ఎయిమ్స్‌లో ఈ వర్చువల్ అటాప్సీ విధానం అమలవుతోంది.

Also read: కేంద్ర మంత్రుల్లో ఎవరికి ఏ శాఖ..?

ఇతర రాష్ట్రాలకు వర్చువల్ శవపరీక్ష

ఐదేళ్లుగా ఈ వర్చువల్‌ శవపరీక్ష విధానాన్ని విస్తరించేందుకు ICMR చర్యలు తీసుకుంటోంది. రిషికేశ్ ఎయిమ్స్‌లో డీఎం-ఫొరెన్సిక్ రేడియాలజీ అండ్ వర్చువల్ అటాప్సీ కోర్సులో ఫోరెన్సిక్‌లో ఎండీ చేసినవారికి ప్రవేశాలు కూడా కల్పిస్తుండటం మరో విశేషం. అంతేకాదు ఈ కోర్సును మరిన్ని ఆసుపత్రుల్లో ప్రారంభించేందుకు కేంద్రం యోచిస్తోంది. అయితే ప్రతిఏడాది గుంటూరు, విశాఖపట్నం బోధనాసుపత్రుల్లో 2 వేలు, మిగిలిన బోధనాసుపత్రుల్లో 1000 -1500 వరకు శవపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక అసహజ మరణం చెందిన మృతదేహాలకు బోధనాసుపత్రులు, ప్రాంతీయ, సామాజిక, జిల్లా ఆసుపత్రుల్లో పోస్టుమార్టం చేస్తుంటారు. మృతుల వివరాలు అందిచడం, వైద్యులు అందుబాటులో ఉండి వెంటనే శవపరీక్ష చేస్తే ఇది పూర్తి కావడానికి 3-4 గంటలు పడుతుంది. ఈ పరీక్షలో వైద్యులు వివిధ పరికరాలు వినియోగించి ఛాతీ, కడుపు, పుర్రెను తెరుస్తారు. మృతదేహంపై ఎక్కడ గాయాలైనా కూడా ఈ నాలుగు భాగాల పరిశీలన ద్వారానే మరణానికి గల కారణాలు 90 శాతం నిర్ధారణ అవుతాయి.

ఇమేజెస్ ఆధారంగా మరణం నిర్ధారణ

వర్చువల్‌ అటాప్సీ ప్రక్రియ మాత్రం అరగంటలోనే పూర్తవుతుంది. మృతదేహాన్ని బ్యాగుల్లో చుట్టి సాధారణ సీటీ, ఎమ్మారై స్కానింగ్‌ లాగే ఇందులో కూడా టెస్ట్ చేస్తారు. శవంతో కూడిన బ్యాగ్ మిషన్ లోపలికి పంపిస్తుండగా.. శరీర అవయవాలను అన్ని కోణాల నుంచి పరిశీలించేలా ఇమేజెస్‌ జనరేట్ అవతాయి. వాటిని పరిశీలించి కండరాలు, కాలేయం, కిడ్నీ, ఇతర అవయవాల్లో గాయాలను గుర్తిస్తారు. ఇమేజెస్‌ ఆధారంగా మరణం ఎలా జరిగిందో నిర్ధారిస్తారు. సాధారణ శవపరీక్ష నివేదికలు, డిజిటల్ అటాప్సీ నివేదికలకు ఎలాంటి వ్యత్యాసం ఉండదు. సెక్షన్ 65ఏ, 65బీ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ ప్రకారం న్యాయస్థానాలు వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటాయి.

Also read: మోదీ కేబినెట్‌లో ఏ రాష్ట్రానికి ఎక్కువగా మంత్రి పదవులంటే ?

వర్చువల్ అటాప్సీ విధానం 80 నుంచి 90 శాతం అసహజ మరణ కేసులకు చేస్తారు. కొన్ని సంప్రదాయ (కత్తిగాటు) శవపరీక్ష తప్పదు. ఇక విషప్రయోగం జరిగినటువంటి కేసుల్లో అసలు కారణాలు తేల్చేందుకు పొట్టభాగంలో కత్తిగాట్లు తప్పనిసరి. మరికొన్ని కేసుల్లో అనుమానిత శరీర భాగంలోని కణజాలాన్ని సేకరించి.. మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ ద్వారా మరణం ఎలా జరిగింది అని నిర్ధారించాల్సి ఉంటుంది. ఇక మలం, మూత్రం, ఫ్లూయిడ్స్‌ పరీక్షలు చేయాల్సిన కేసుల్లో కూడా నమూనాలు సేకరించేందుకు పలు భాగాల్లో కత్తిగాట్లు పడక తప్పదు. ప్రత్యేక సందర్భాల్లో ఇమేజెస్ ద్వారా సీనియర్ వైద్య నిపుణుల అభిప్రాయలను స్థానిక వైద్యులు తెలుసుకునేందుకు ఈ విధానం వీలుంటుందని విజయవాడ జీజీహెచ్‌ ఫోరెన్సిక్ విభాగం డాక్టర్‌ మహేశ్ తెలిపారు. అలాగే ఈ విధానంలో ఇమేజింగ్ సాంకేతికత ద్వారా మృతదేహంలో అన్ని భాగాలను నిశితంగా పరిశీలించి, మరణానికి గల కారణాలు ధ్రువీకరిస్తాని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు