Explainer: నాసాను తోసి..రోదసీలో ఇస్రో జెండా పాతేంగే..రానున్న 20 ఏళ్ల లక్ష్యాలివే..!!

భారత అంతరిక్ష పరిశోధనలో మరో సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇప్పటివరకు కేవలం ఉపగ్రహాలు, రాకెట్ లాంచింగ్ వంటి పరిశోధనలకు మాత్రమే పరిమితమైనటువంటి ఇస్రో తాజాగా అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ను సైతం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రధాని మోదీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇస్రో రాబోయే 20 సంవత్సరాలకు గాను ఇప్పటినుంచే ప్లాన్స్ మొదలు పెట్టేసింది 2025 నాటికి ఎట్టకేలకు రోదసిలోకి భారతీయుడిని పంపాలని కృత నిశ్చయంతో ముందుకు అడుగులు వేస్తోంది. చంద్రయాన్ ఇచ్చినటువంటి ఉత్సాహాన్ని గగన్ యాన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.

New Update
Explainer: నాసాను తోసి..రోదసీలో ఇస్రో జెండా పాతేంగే..రానున్న 20 ఏళ్ల లక్ష్యాలివే..!!

రోదసిలో భారతదేశం ఇప్పటికే అద్భుతాలు సృష్టిస్తోంది. అసాధ్యాలను సైతం సుసాధ్యాలను చేస్తుంది. ఓ వైపు అమెరికా, రష్యా, యూరప్ లాంటి దేశాలు విఫలం అవుతున్న పలు ప్రయోగాల్లో భారతదేశం సఫలం అవుతుంది. ఇటీవల చంద్రయాన్ మిషన్, ఆదిత్య ఎల్ వన్ మిషన్ సక్సెస్ అయిన నేపథ్యంలో భారతదేశం ఖగోళ రహస్యాలను ఛేదించేందుకు మరింత దూకుడు పెంచుతోంది. ఇంతకాలం ఇస్రోకు నామమాత్రంగానే నిధులు అందేవి. కానీ చంద్రయాన్ సక్సెస్ ఒక్కసారిగా ఇస్రో బాధ్యతను బ్రాండ్ ఇమేజ్‎ను అమాంతం పెంచేశాయి. ఫలితంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో చేస్తున్న ప్రయోగాలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సిద్ధమైపోయారు.

ఇంతకాలం నిధుల లేమితో పలు ప్రయోగాలకు వెనకడుగు వేసిన ఇస్రో.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో మరింత ముందుకు వెళ్లాలని.. భారత కీర్తి పతాకాన్ని రోదసిలో రెపరెపలాడేలా ఎగురవేయ్యాలన్న సంకల్పంతో ముందుకు వెళుతోంది. 1960వ దశకంలో బుడిబుడి అడుగులతో మొదలైన ఇస్రో ప్రయాణం.. ఇప్పుడు ఖగోళ రహస్యాలను ఛేదించే దిశగా సాగుతోంది. ఇంతకాలం కేవలం ఉపగ్రహాలు ప్రవేశపెట్టడం, కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం మాత్రమే పనిచేసిన ఇస్రో..ఇప్పుడు నాసా తరహాలోనే ఖగోళ రహస్యాలను బయటపెట్టేందుకు పలు ప్రయోగాలను చేపట్టబోతోంది.

ఇది కూడా  చదవండి: కుక్క తెచ్చిన తంట..రాహుల్‎పై కేసు నమోదు..!!

ఇస్రోకు వెన్నంటి నిలుస్తున్న మోదీ సర్కార్:
చంద్రయాన్ సక్సెస్ అనంతరం ఇస్రో ఖ్యాతి ఖండాంతరాలను తాకింది. అతి తక్కువ బడ్జెట్‎లోనే, చురుకైన మేధోశక్తితోని మన సైంటిస్టులు పలు ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. నిజానికి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చుతో ఇస్రో ఏకంగా రోదసిలోకి రాకెట్లను ఉపగ్రహాలను పంపుతూ..ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు మన్ననలు అందుకుంది. అయితే ఇందుకు కొనసాగింపుగా అటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సైతం ఇస్రోను ప్రోత్సహించేందుకు కావాల్సినన్ని నిధులను కేటాయిస్తోంది.

భారతీయ అంతరిక్ష స్టేషన్ లక్ష్యం: 

తాజాగా చంద్రయాన్ -3 , ఆదిత్య-ఎల్ 1 మిషన్‌లతో సహా అనేక భారతీయ అంతరిక్ష కార్యక్రమాల విజయాన్ని ప్రశంసిస్తూ, 'భారతీయ అంతరిక్ష స్టేషన్' (Indian) ఏర్పాటుతో సహా, ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఇస్రో శాస్త్రవేత్తలను కోరారు. రోదసిలో భారత అంతరిక్ష కేంద్రం 2035 నాటికి పూర్తి చేయాలని, 2040 నాటికి భారతీయులను చంద్రునిపైకి పంపాలని పీఎంఓ( PMO)నుండి వెలువడిన ఓ అధికారిక ప్రకటన పేర్కొంది.

దీనికి తోడు వీనస్ ఆర్బిటర్ మిషన్, మార్స్ ల్యాండర్ మిషన్‌తో కూడిన ఇంటర్-ప్లానెటరీ మిషన్‌ల కోసం పని చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్‌' పురోగతిని అంచనా వేయడానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌, ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌, ఇస్రో హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎం మోహన్‌ హాజరైన అత్యున్నత స్థాయి సమావేశానికి మోదీ అధ్యక్షత వహించిన అనంతరం పీఎంవో నుంచి ఈ ప్రకటన వెలువడింది.

ఇది కూడా  చదవండి: ఏపీ విద్యార్థులు, ఉద్యోగులకు అలర్ట్.. దసరా సెలవులో మార్పు..వివరాలివే!

గగన్‎యాన్ మిషన్‎కు పచ్చజెండా:
డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ (DoS)కి నేతృత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఇస్రో సీనియర్ అధికారులు గగన్‌యాన్ మిషన్‌ పురోగతిపై పూర్తి స్థాయి వివరణ అందించారు. మానవ-సహిత రోదసి ప్రయోగ వాహనాలు, సిస్టమ్ క్వాలిఫికేషన్ వంటి అభివృద్ధి చేసిన టెక్నాలజీలతో సహా, గగన్‌యాన్ ‎కు సంబంధించిన పూర్తి స్థాయి రిపోర్టును ప్రధాని మోదీకి DoS సమర్పించింది. మానవ-సహిత లాంచ్ వెహికల్ (HLVM3) మూడు అన్‌క్రూడ్ మిషన్‌లతో సహా దాదాపు 20 ప్రధాన పరీక్షలు గగన్ యాన్ పరిశోధనల్లో భాగంగా ప్లాన్ చేసినట్లు ఇస్రో అధికారులు ప్రధాని మోదీకి వివరించారు.

గగన్‌యాన్ మిషన్ కు బడ్జెట్ పై అంచనా:
ప్రధాని నేతృత్వంలోని సమావేశం గగన్‌యాన్ మిషన్ కు పూర్తిస్థాయి సంసిద్ధతకు కావాల్సిన బడ్జెట్ కూడా అంచనా వేసింది. 2025లో అంతరిక్షంలోకి మనుషులతో కూడిన మిషన్‌ను ప్రారంభించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రధాని మోడీ 2018లో తన ఎర్రకోటపై స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో మొదటిసారి గగన్‌యాన్ కార్యక్రమాన్ని ప్రకటించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా, మానవ సహిత అంతరిక్షయానం కార్యక్రమం కాస్త ఆలస్యమైంది. కానీ కరోనా తర్వాత, కార్యక్రమం ఊపందుకుంది. రాబోయే నెలల్లో గగన్ యాన్ కు సంబంధించిన పలు పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది. మానవ సహిత మిషన్‌లో భారతీయ వ్యోమగాములను ఉంచే క్రూ మాడ్యూల్‌ టెస్ట్ వెహికల్ డెవలప్‌మెంట్ ఫ్లైట్ ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో పరీక్షించనున్నారు .

వ్యోమ్ మిత్రతో కలిసి మరో మిషన్:
TV-D1 అనేది క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపడం, దానిని తిరిగి భూమికి తీసుకురావడం, బంగాళాఖాతంలో తాకిన తర్వాత దాన్ని రీస్టోర్ చేయడం.. భారత నౌకాదళానికి చెందిన డైవింగ్ బృందం సిబ్బంది మాడ్యూల్‌ను తిరిగి పొందేందుకు ప్రత్యేక నౌకను ఉపయోగిస్తుంది. TV-D1 పరీక్ష తర్వాత, D2, D3, D4 అనే మరో మూడు టెస్ట్ మిషన్లు నిర్వహించనున్నారు. తరువాత, హ్యూమనాయిడ్, వ్యోమ్ మిత్రతో కలిసి మరో మిషన్ నిర్వహించనున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే, 2-3 భారతీయ వ్యోమగాములు భూమి చుట్టూ 400 కి.మీ ఎత్తులో పరిభ్రమించే మానవ సహిత అంతరిక్ష యాత్ర 2025లో ప్రారంభ మవుతుంది.

ఇది కూడా  చదవండి: 37 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఇదే.. ఆర్టీవీ ఎక్స్‌క్లూజివ్

నాసాను సైతం వెనక్కు నెట్టేసిన ఇస్రో:
ప్రపంచవ్యాప్తంగా రోదసి పరిశోధనలు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది నాసా సంస్థ. అమెరికాకు చెందినటువంటి నాసా సంస్థ ఇప్పటివరకు పలు సక్సెస్ ఫుల్ ఖగోళ ప్రయోగాలను చేపట్టింది. ఇందులో అంగారక గ్రహంపై వ్యోమ నౌకను సైతం దింపింది. అయితే ఇస్రో సైతం నాసా సంస్థకు ఏమాత్రం తీసిపోకుండా రోదసి పరిశోధనలో దూసుకెళ్తోంది. ముఖ్యంగా నాసా పెట్టే ఖర్చు కన్నా కూడా అతి తక్కువ ఖర్చులోనే ఇస్రో పలు ప్రయోగాలను చేపడుతోంది.

దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే చైనా, రష్యా లాంటి దిగ్గజ దేశాలు సైతం భారత చేస్తున్నటువంటి ప్రయోగాలను నిశితంగా గమనిస్తున్నాయి. అటు చిన్న దేశాలు సైతం భారత ద్వారానే తాము తయారు చేసిన ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడుతున్నాయి. ఈ రకంగా భారతదేశానికి ఇస్రో పేరు ఖ్యాతితోపాటు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతోంది. ఇక భవిష్యత్తులో రాను రాను ఇస్రో మరింత వేగంగా దూసుకెళ్లే అవకాశం కల్పిస్తోంది. అమృతకాలంలో ఇస్రో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ(Number one space research agency)గా ఎదిగిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు