/rtv/media/media_files/2025/10/02/telangana-medchal-wife-killed-husband-in-indira-nagar-colony-2025-10-02-12-16-36.jpg)
Wife Killed Husband
Anantapur wife killed husband : ఈ మధ్యకాలంలో భార్యల చేతిలో హత్యలకు గురవుతున్న భర్తల సంఖ్య పెరిగిపోతున్నది. కుటుంబకలహాలు, అక్రమ సంబంధాల నేపథ్యంలో ఈ దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోనూ భార్య చేతిలో మరో భర్త హతమయ్యాడు. ఓ భార్య తన భర్తను హత్య చేసింది. అంతే కాదు శవాన్ని ఇంటి ముందే గొయ్యి తీసి పాతిపెట్టింది. ఈ దిగ్భ్రాంతికర ఘటన జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం పాతచెరువులో నాలుగు నెలల కిందట జరగగా, ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితురాలు తన కుమార్తెతో గొడవపడిన సందర్భంలో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం బయటకు తెలియడంతో ఆమె నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామానికి చెందిన హనుమంతు, సుకన్య భార్యాభర్తలు. వీరికి ఇంటర్ చదువుతున్న కూతురు ఉంది. హనుమంతుకు ఈ మధ్య మద్యానికి అలవాటయ్యాడు. దీంతో కొద్ది రోజులగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నాలుగు నెలల కిందట ఎప్పటిలాగే హనుమంతు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య మాటమాట పెరిగి ఇద్దరూ గొడవ పడ్డారు. అవేశంతో ఊగిపోయిన సుకన్య భర్తమీద కోపంతో రోకలిబండతో హనుమంతుపై దాడి చేసింది. ఒక వైపు కూతురు వారిస్తున్నప్పటికీ వినకుండా హనుమంతును రోకలిబండతో కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.
ఆవేశంతో కొట్టిన దెబ్బలకు భర్త చనిపోవడంతో ఆ హత్య నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ఆరోజే రాత్రి ఇంటి ముందు గొయ్యి తీసి భర్త హనుమంతు శవాన్ని అందులో పాతిపెట్టింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండటం కోసం రోజూ ఇంటి ముందు కళ్లాపి జల్లి.. ముగ్గులు పెడుతుంది. అయితే ఈ విషయం కూతురుకు తెలిసినప్పటికీ తల్లికి ఎక్కడ ఇబ్బంది అవుతుందోనని ఎవరికీ చెప్పలేదు. అయితే ఈ రోజు (శుక్రవారం) ఉదయం తల్లీ సుకన్య , కుమార్తెకు మధ్య గొడవ జరిగింది, ఈ గొడవతో హనుమంతు హత్య విషయం వెలుగు చూసింది. ఈ గొడవలో భాగంగా తండ్రి హనుమంతును సుకన్య హత్య చేసి.. ఇంటి ముందు పాతిపెట్టిన విషయాన్ని బయటపెట్టింది. దీంతో చుట్టుపక్కల వారు ఈ విషయం విని పోలీసులకు సమాచారం అందించారు. భర్త హత్య ఉదాంతం అందరికీ తెలిసి పోవడంతో సుకన్య నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయింది. కాగా పోలీసులు హనుమంతు శవాన్ని వెలకితీసి పోస్టుమార్టంకు పంపించారు. స్థానికంగా ఈ విషయం కలకలం సృష్టించింది.
Follow Us