/rtv/media/media_files/2025/08/21/five-members-of-same-family-found-dead-under-suspicious-circumstances-in-hyderabad-2025-08-21-09-53-45.jpg)
Son kills father for pension money!
Crime News : కన్న తండ్రి అని కూడా చూడకుండా, కేవలం పింఛను డబ్బుల కోసం ఓ కొడుకు కర్రతో కొట్టి ప్రాణాలు తీసిన ఘోర కలి అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగుచూసింది. పెదబయలు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.సీఐ లక్ష్మణ్రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పెదబయలు మండలం, సీకరి పంచాయతీ పరిధిలోని వెలుపాలెం గ్రామానికి చెందిన లకేయి సింహాచలం (60) తన భార్య నీలమ్మతో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, సోమవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో సింహాచలానికి, అతని కొడుకు రమేష్కు మధ్య పింఛను డబ్బుల విషయమై తీవ్రమైన గొడవ జరిగింది. ఈ ఘర్షణ కాస్తా ముదరడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు రమేష్.. తండ్రి చేతిలో ఉన్న కర్రనే లాక్కుని, అదే కర్రతో తండ్రి తలపై బలంగా బాదాడు. తీవ్రమైన గాయం కావడంతో సింహాచలం అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గొడవ శబ్దాలు విని స్థానికులు అక్కడికి చేరుకునే సరికి నిందితుడు రమేష్ అక్కడి నుంచి పరారయ్యాడు.
స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు రాత్రికి రాత్రే ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణలో ఒక షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. నిందితుడైన రమేష్ ఐదేళ్ల క్రితం తన భార్యను కూడా ఇలాగే దారుణంగా చంపేసి, జైలు శిక్ష అనుభవించి, ఇటీవలనే తిరిగి స్వగ్రామానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.పోలీసులు సింహాచలం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముంచంగిపుట్టు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ఘటనపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు రమేష్ను త్వరలోనే పట్టుకుంటామని సీఐ లక్ష్మణ్రావు వెల్లడించారు. ఈ దర్యాప్తు, ఘటనా స్థల పరిశీలనలో ఎస్సైలు టి.వెంకటేష్, బి.సాయిరాం పడాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Follow Us