AP: మిర్చి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్!

మిర్చి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మిర్చి రైతులను గట్టెక్కించడమే లక్ష్యమని చెప్పిన సీఎం చంద్రబాబు..క్వింటా మిర్చి ధర రూ.11,781 కంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. 

New Update
AP

AP CM Chandra Babu, Mirchi Farmers

ధర తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్న మిరప రైతులను గట్టెక్కించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఎగుమతి దారులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు సహకరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో మిరప రైతులను ఆదుకోవాలన్నదే తన తాపత్రయం అని సీఎం అన్నారు. క్వింటా మిర్చి ధర రూ.11,781 కంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చారు. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే మిర్చి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ ద్వారా మిర్చి కంటెయినర్‌ల రవాణాకు అనుమతులు జారీ చేస్తామని చెప్పారు. అలాగే గుంటూరు మార్కెట్ యార్డులో లారీ యజమానుల తీరుపై రైతుల ఫిర్యాదు చేయగా దానిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటూ 
గుంటూరులోని స్పైస్ పార్కుకు మౌలిక సదుపాయాల కల్పన చేస్తామని మిర్చి రైతులకు హామీ ఇచ్చారు. 
మిర్చి ధరలు తగ్గి రైతులు ఇబ్బందులు పడతున్నారన్న అంశం తన దృష్టికి వచ్చిన వెంటనే గతేడాది డిసెంబర్ 26, ఈ ఏడాది ఫిబ్రవరి 5, 11వ తేదీల్లో కేంద్రానికి లేఖ రాశానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. సచివాలయంలో మిర్చి రైతులు, వ్యాపారులు, అధికారులు, ఎగుమతిదారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రైతులు, వ్యాపారులు, ఎగుమతి దారుల నుంచి వారి సమస్యలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. 

ఈ సమావేశంలో మిర్చి రైతులు, వ్యాపారులు తమ సమస్యలను చెప్పుకున్నారు. మిరప సాగుకు ఏటికేడు పెట్టుబడి పెరుగుతోందని, పెరిగిన పెట్టుబడి స్థాయిలో తమకు ఆదాయం రావడం లేదని రైతులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా మిర్చికి నల్లతామర తెగులుతో పంట నాణ్యత తగ్గడంతో పాటు దిగుబడి తగ్గిపోతోందని రైతులు తెలిపారు. ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకూ ఖర్చు అవుతోందని వివరించారు. కూలీ ఖర్చులు ఎప్పుడూ లేని విధంగా ఈ సారి మరింత పెరిగాయన్నారు. అయినా కూలీలు దొరకడం లేదని అన్నారు. ఎన్నో వ్యయప్రసాయాలతో యార్డుకు పంటను తెస్తే ఉదయం పూట నిర్ణయించిన ధర మళ్లీ మచ్చుకుకు వచ్చిన తర్వాత ఉండటం లేదన్నారు. క్వింటాకు రూ.500 చొప్పున వ్యాపారులు తగ్గిస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రశ్నిస్తే క్వాలిటీ సరిగా లేనందువల్లే తగ్గిస్తున్నామని వ్యాపారులు సమాధానం చెప్తున్నారని, ఉదయం ఉన్న క్వాలిటీ మధ్యాహ్నానికే ఎలా తగ్గుతుందని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. యార్డుకు టిక్కీలు తేవాలంటే బాడిగకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని,  యూనియన్‌లో లేని లారీలను బాడిగకు తీసుకొస్తే వారిని మిగతా లారీ యజమానులు బెదిరించి, కేసులు పెడుతున్నారని వివరించారు. నాటి తెలుగు దేశం ప్రభుత్వంలో ఇచ్చినట్లు క్వింటాకు ఇంత అని బోనస్ ప్రకటిస్తే రైతులకు మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. 

మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది..సీఎం చంద్రబాబు

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ....మిర్చి రైతుల నుంచి కిరాయి ఎక్కువ వసూలు చేసే లారీ యాజమాన్యాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రవాణాను కొందరు తమ గుప్పెట్లో పెట్టుకుని రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించవద్దని అధికారులకు సూచించారు. మిర్చి యార్డులో ఎలక్ట్రానిక్ కాటాలు ఏర్పాటు చేసి మిర్చి టిక్కీలు కాటాలు వేసిన వెంటనే రైతుల ఫోన్లకు మెసేజ్‌లు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోల్డ్ స్టోరేజీలో టిక్కీలు నిల్వ చేసుకున్న రైతులకు బాండ్ల ఆధారంగా రుణాలు ఇచ్చేలా త్వరలో బ్యాంకర్లతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. గుంటూరులోని స్పైస్ పార్క్‌లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులు మిర్చిని కల్లాల్లో ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అధికారులు తగిన సూచనలు చేయాలన్నారు. పంట అమ్మగా వచ్చిన ప్రతీపైసా రైతులకే చెందాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు  పాల్గొన్నారు.

Also Read: BIG BREAKING: అపోలో ఆస్పత్రిలో డిప్యూటీ సీఎం పవన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు