/rtv/media/media_files/2026/04/16/temperature-2026-04-16-14-04-57.jpg)
Temperature
తెలంగాణవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో మధ్యాహ్నం పూట బయటకు వచ్చేందుకు జనాలు జంకుతున్నారు. ఈ క్రమంలోనే రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజ్గిరి , హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Also Read: వికారాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత..కల్వకుంట్ల కవిత అరెస్ట్..
రానున్న మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఉన్న దానికన్నా మరో ఒకటి నుంచి రెండు డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41°C నుండి 44°C వరకు రికార్డు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీనికి తోడు పలు జిల్లాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.
Also Read: దక్షిణాది ముఖ్యమంత్రులకు రేవంత్ రెడ్డి లేఖ.. ఎందుకంటే?
గురువారం ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండటానికి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.
Follow Us