/rtv/media/media_files/2026/03/12/gas-cylinder-2026-03-12-18-55-13.jpg)
Gas cylinder block racket
Gas cylinder block racket : ఇరాన్పై అమెరికా యుద్ధం ప్రభావం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై పడింది. డొమెస్టిక్ సిలిండర్లకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదే సమయంలో వాణిజ్య సిలిండర్ల సరఫరా పునరుద్దరించారు.అయితే ఈ పరిస్థితులను ఆసరాగా తీసుకున్న కొందరు అక్రమార్కులు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ దందాకు తెరతీశారు. అక్రమంగా గ్యాస్ దందాకు తెరతీసిన వారిపై సివిల్ సప్లయి శాఖాధికారులు చర్యలకు సిద్దమయ్యారు.
ఎల్పీజీ సిలిండర్ల కొరత నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రీఫిల్ కోసం బుకింగ్స్ పెరిగాయి.అత్యవసరంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అవసరమైతే బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేటుకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు బ్లాక్ లో రూ. 2 వేలు వసూలు చేస్తున్నారు. కమర్షియల్ సిలిండర్లు బ్లాక్ లో రూ. 5 నుంచి రూ. 6 వేల వరకు వసూలు చేస్తున్నా రనే ఆరోపణలున్నాయి.రాష్ట్రంలో సుమారు 1.29 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లున్నాయి. 810 మంది డిస్ట్రిబ్యూటర్ల ద్వారా వినియోగదారులకు గ్యాస్ సరఫరా అవుతోంది. ప్రతిరోజూ సగటున 2.5 లక్షల సిలిండర్లు అవసరం అవుతోంది. ఇందులో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల డిమాండ్ 86 శాతం. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు రోజుకు 23వేల నుంచి 35 వేల వరకు డిమాండ్ ఉంటుంది.సాధారణంగా రోజుకు 23 వేల కమర్షియల్ సిలిండర్లు అవసరమైతే ఇందులో కేవలం 20 నుంచి 30 శాతం మాత్రమే సరఫరా అవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 10, 611 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలన్నాయి. ఇది 7 లక్షల సిలిండర్లకు సమానం. ఎల్పీజీ సిలిండర్ల డిమాండ్ నేపథ్యంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని గోదాములే కేంద్రాలుగా అక్రమ రీ-ఫిల్లింగ్ కు పాల్పడుతున్నారు.
శంషాబాద్, నార్సింగి, ఎల్బీనగర్, చందానగర్ ప్రాంతాల్లో అక్రమార్కులు ఈ దందాకు శ్రీకారం చుట్టారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల నుంచి గ్యాస్ అక్రమంగా చిన్న సిలిండర్లలో నింపుతున్నారు. మరోవైపు ఎల్పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ దందాపై సివిల్ సప్లయిస్ శాఖాధికారులు రంగంలోకి దిగారు. ఈ నెల రెండోవారంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హోటల్స్పై దాడి చేసి భారీగా డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.కరీంనగర్ జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్ల అక్రమ మళ్లింపు జరుగుతోందని అధికారులు నిఘా పెంచారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వాణిజ్య అవసరాలకు అంటే హోటల్స్ ఇతర అవసరాలు డొమెస్టిక్ సిలిండర్లను తరలించినట్టు కేసులు నమోదయ్యాయి.
ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లపై నిరంతర నిఘా కొనసాగుతోంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి.ఎల్పీజీ సిలిండర్ల అక్రమ దందా అరికట్టేందుకు ఈ కమిటీ చర్యలు తీసుకుంటుంది. బహిరంగ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా చేస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ముఠాగా ఏర్పడి కమర్షియల్ గ్యాస్ను అక్రమంగా మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. హోటళ్లు, రెస్టారంట్లకు అధిక ధరలకు గ్యాస్ విక్రయిస్తున్నట్లు కనిపెట్టారు. డీలర్తోపాటు 10 మందిని అరెస్టు చేశారు. పంజాగుట్టలోని శ్మశాన వాటికలో సిలిండర్లు నిల్వ చేశారు. మొత్తం 414 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఏడాదిన్నరగా ఈ బ్లాక్ మార్కెట్ దందా కొనసాగిస్తున్నారు. గ్యాస్ కొరత ఉన్నట్లు నిందితులు వదంతులు సృష్టిస్తున్నారని పోలీసులు తెలిపారు. క
మర్షియల్ సిలిండర్ రూ.2వేలు ఉంటే.. రూ.6 వేలకు విక్రయిస్తున్నారని పోలీసులు వివరించారు. నిందితుల నుంచి 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులకు శంషాబాద్లో ఓ గోదాం ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు మహ్మద్ అమీర్ను బంజారాహిల్స్కు చెందిన వ్యక్తిగా గుర్తించామని పోలీసులు వివరించారు.ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే సమయంలో కస్టమర్ మొబైల్ కు వచ్చే ఓటీపీని నమోదు చేస్తేనే డెలివరీ పూర్తైనట్టు. దీంతో వినియోగదారుల పేరుతో ఇతరులకు సిలిండర్లను మళ్లించడం సాధ్యం కాదు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకొనేలా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశారు. గ్యాస్ నిల్వ చేసి బ్లాక్ మార్కెట్ చేసే డీలర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్రమాలకు పాల్పడే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులను తక్షణమే రద్దు చేసే అధికారం స్థానిక అధికారులకు ఇచ్చారు. గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ లేదా అక్రమ విక్రయాల గురించి 1967 లేదా 1800 4250033 నెంబర్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.మరో వైపు అక్రమంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల దందాకు పాల్పడుతున్న సుమారు 50 మందిని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లో సుమారు 450, నల్గొండలో 124, కరీంనగర్ లో 39, మహబూబ్ నగర్ లో 54, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లో 47 ఎల్పీజీ సిలిండర్లను సివిల్ సప్లయిస్ శాఖాధికారులు సీజ్ చేశారు.
Follow Us