Punarvika : స్పందించిన దాతలు..₹16 కోట్ల ఇంజెక్షన్‌తో పునర్వికకు పునర్జన్మ..

కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్వికకి అరుదైన ఎస్‌ఎంఏ టైప్-1 వ్యాధి చికిత్స కోసం వైద్యులు రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను అందించారు. ఈ కీలక పరిణామంపై మంత్రి నారా లోకేశ్‌ స్పందిస్తూ తన హామీ నెరవేరిందంటూ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

New Update
FotoJet (15)

Punarvika was reborn with an injection of ₹16 crore.

Punarvika : కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్వికశ్రీకి అరుదైన ఎస్‌ఎంఏ టైప్-1 వ్యాధి చికిత్స కోసం శనివారం వైద్యులు రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను విజయవంతంగా అందించారు. ఈ కీలక పరిణామంపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ స్పందిస్తూ తన హామీ నెరవేరిందంటూ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఈ చిన్నారి ప్రాణాలను కాపాడతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. దాతల నుంచి వచ్చిన రూ. 10 కోట్లతో పాటు మిగిలిన రూ. 6 కోట్ల బాధ్యతను లోకేశ్‌ తీసుకున్నారు. విదేశాల నుంచి అత్యంత ఖరీదైన జోల్‌జెన్‌స్మా ఇంజెక్షన్‌ను ఆయన ప్రత్యేకంగా తెప్పించారు.

హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో మంత్రి లోకేశ్‌ సమక్షంలోనే వైద్యులు చిన్నారి పునర్వికకు ఈ ఇంజెక్షన్ వేశారు. ఈ సందర్భంగా పాప నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. వెల్దుర్తి మండలానికి చెందిన సురేష్ మరియు పుష్పావతి దంపతులకు పుట్టిన పునర్విక గతేడాది ఏప్రిల్‌లో జన్మించింది. పుట్టిన మూడు నెలల తర్వాత పాపలో కదలికలు లేకపోవడంతో తల్లిదండ్రులు వైద్యులను ఆశ్రయించగా ఈ ప్రాణాంతక వ్యాధి బయటపడింది. కోట్లలో ఒకరికి మాత్రమే వచ్చే ఈ అరుదైన వ్యాధికి భారీ ఖర్చు అవసరమైంది.ఈ చిన్నారికి ఇంజెక్షన్‌ కోసం రూ.16 కోట్లు అవసరమైన విషయం తెలిసిందే. దీనిపై రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన దాతలు స్పందించి రూ.10 కోట్లు సమకూర్చారు. మిగిలిన రూ.6 కోట్లకు లోకేష్‌ హామీ ఇచ్చారు. అన్నట్లుగా నే ఇంజెక్షన్‌ తెప్పించారు.

పునర్విక దీనస్థితిపై గతంలో పలు పత్రికలు, సోషల్‌ మీడియాలో ప్రసారమైన కథనాలు అందరినీ కదిలించింది. ఆ కథనాల ద్వారా పాప పరిస్థితి తెలుసుకున్న దాతలు తమ వంతు సాయం అందించేందుకు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ విషయం వైరల్ కావడంతో సాధారణ ప్రజలు కూడా విరాళాలు సేకరించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. క్లిష్ట సమయంలో తమ కుమార్తెను ఆదుకుని కొత్త జీవితాన్ని ప్రసాదించిన దాతలకు మంత్రి లోకేశ్‌కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విరాళాల సేకరణ  ప్రభుత్వ తోడ్పాటుతో చిన్నారి ప్రాణాలు సురక్షితంగా నిలబడ్డాయి.

Advertisment
తాజా కథనాలు